హైదరాబాద్ స్వేచ్ఛ వాయువులు ఎలా పీల్చింది?

Update: 2020-09-17 06:50 GMT
బ్రిటిష్‌ పాలన నుంచి భారత్‌కు విముక్తి లభించినా.. హైదరాబాద్‌ సంస్థానానికి నిజాం నిరంకుశ పాలన నుంచి మాత్రం స్వేచ్ఛ లభించని వేళ. అప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన నిజాం రాచరిక పాలన శాశ్వత నిద్రలోకి జారుకుంది. రజాకార్ల అకృత్యాలతో ఎన్నో బాధలు.. ఎన్నో అరాచకాలు.. మరెన్నో కష్టాలను అనుభవించిన ప్రజలు ఆ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. హైదరాబాద్‌ సంస్థానం ఆనందంతో ఉప్పొంగింది. అడుగడుగునా త్రివర్ణ పతాకలు  రెపరెలాడాయి. బొల్లారం నుంచి  హైదరాబాద్‌ వైపు సాగిన భారత సైనిక బలగాలకు నగర ప్రజలు  జయజయధ్వానాలు పలికారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ ఆ  రోజు జనసంద్రమైంది.

1911 నుంచి 1948 వరకు 37 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలించిన  మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ఓటమిని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. ‘ఆపరేషన్‌  పోలో’ విజయవంతమైంది. ఇదంతా నాణేనికి  ఒకవైపు అయితే  మరోవైపు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి సైతం ఆ మూడున్నర దశాబ్దాల నిజాం పరిపాలనే పునాదులు వేసింది. ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి బాటలు పరిచింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా వంటి  అనేక రంగాల్లో నిజాం  నవాబు  సరికొత్త శకానికి నాంది పలికారు. రైళ్లు,రోడ్డు రవాణా సదుపాయాలు  అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ఆ పునాదులపైన మహానగరం  విస్తరించుకుంది. అంతర్జాతీయ ఖ్యాతిని  ఆర్జించింది.

హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య  సెప్టెంబర్‌ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ మేజర్‌ రాజేంద్రసింగ్‌ నేతత్వంలో మేజర్‌ జనరల్‌ జేఏ చౌదరి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి  హైదరాబాద్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.షోలాపూర్‌ నుంచి బయలుదేరిన  సైన్యం నల్‌దుర్గ్‌ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు వచ్చింది. మేజర్‌ జనరల్‌ డీఎస్‌ బ్రార్‌  ముంబై నుంచి, ఆపరేషన్‌న్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఏఏ రుద్ర  విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్‌ శివదత్త  బేరార్‌ నుంచి  బయలుదేరారు. అన్ని వైపుల నుంచి  భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది.

భారత వైమానిక ఎయిర్‌ మార్షల్‌ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకమైంది.1948 సెప్టెంబర్‌ 14వ తేదీన దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్,  సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం  తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్‌ ప్రాంతాలలో  నిజాం సైనికులపై  భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్‌ 16వ తేదీన రాంసింగ్‌ నేతత్వంలోని సైనికులు  జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు యూనియన్‌న్‌ సైనికులపాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్‌ ఇద్రూస్‌ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో  నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు.

1947 ఆగస్టు15న దేశమంతా స్వతంత్ర జెండాలెగిరితే..హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌ యూనియన్‌లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పావులు కదిపిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏడాది కాలం పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన సాయుధ రైతాంగ గెరిల్లాలను, మరో వైపు సత్యాగ్రహంతో రోడ్డెక్కిన కాంగ్రెస్‌ సమూహాల్ని ఏడాది పాటు నిలువరించగలిగాడు. చివరకు భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు మూడువైపులా చుట్టుముట్టిన సమయంలో నిస్సహాయంగా మిగిలిన నిజాం అప్పటి హోంమంత్రి పటేల్‌ ముందు మోకరిల్లటంతో..ఆజాద్‌ హైదరాబాద్‌ అవతరించింది.

నిజాం వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముఖర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్‌లో స్థిరపడ్డారు. అడడపాదడపా హైదరాబాద్‌ వచ్చి వెళుతున్నారు. వీరిలో ముఖరం జా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్న ముఖర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్‌నామా, చౌమహల్లా, చిరాన్‌ ప్యాలెస్‌లున్నాయి.లండన్‌ డూన్‌ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి పట్టాలు అందుకున్న ముకర్రం జా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్‌ 6, 1933లో పుట్టిన ముఖరం జా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959–75),  అనంతరం ఎయిర్‌హోస్టెస్‌ హెలెన్‌(1980–90).. ఆపై  అప్పటి మిస్‌ టర్కీ మనోలియా ఒనోర్‌ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాఖ్‌’ చెప్పేశాడు.

మొత్తం భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినా ప్రత్యేక దేశంగా ప్రకటించికున్న ‘హైదరాబాద్ నిజాం సంస్థానం’ భారత ప్రభుత్వ సైనిక చర్యతో దేశంలో విలీనం అయ్యింది. ఆ రోజు సెప్టెంబర్ 17. ఈ విలీన దినాన్ని తెలంగాణలో అధికారికంగా జరపకపోవడం మన వైచిత్యంగా కనిపిస్తోందన్న విమర్శలున్నాయి.
Tags:    

Similar News