కాంగ్రెస్‌-బీజేపీల‌ను క‌లిపి ఏకేసిన కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-05-09 14:21 GMT
కాంగ్రెస్‌-బీజేపీ పార్టీల నేత‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర‌య్యారు. రెండు పార్టీల‌ను ఒకేసారి.. క‌లిపి ఏకేశారు. పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయని   విమర్శించారు. నారాయణపేటలో చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయని ఆరోపించారు. ఇక్కడికి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణానదిలో తెలంగాణ వాటాగా 575 టీఎంసీలు ఇవ్వండని మోడీ ప్రభుత్వాన్ని ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ కోరుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ ఎస్ .. ఇంటి పార్టీ

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌, బీజేపీ చేసింది ఏమి లేదని.. నీతిమాలిన జాతీయ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదని కేటీఆర్‌ విమర్శించారు. ఢిల్లీ, గుజరాత్‌ నేతల పార్టీలు అధికారంలోకి రావడానికి శుష్క వాగ్ధానాలు తప్ప చేసేది ఏమి ఉండదని అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించే ఏకైన పార్టీ టీఆర్ ఎస్‌నేనని.. మన ఇంటి పార్టీని గుండెల్లొ పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు.

ఎనిమిదేళ్లుగా.. కోరుతున్నా..

కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తీసుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం సెక్షన్‌ 3 కింద పంపకాలు తేల్చమని, 575 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందిగా ట్రైబ్యునల్‌కు సిఫారసు చేయమని ఎనిమిదేళ్లుగా కేంద్రానికి విఙ్ఞప్తి చేస్తున్నా చలనం లేదని మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణపై చిత్త శుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీకి స‌వాల్‌!

``ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు. చేసిందేమి లేకపోగా ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తూ దిక్కుమాలిన మాటలు, పచ్చి అబద్ధాలతో మహబూబ్నగర్ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇస్తామని సుష్మాస్వరాజ్ చెప్పారు. దమ్ముంటే ప్రధాని మోడీ జాతీయ హోదా ప్రకటించాలి. 14న అమిత్ షా వస్తున్నారంటా... 500 టీఎంసీలు కేటాయిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా`` అని స‌వాల్ రువ్వారు.

బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు లేవ్‌?

రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు.. వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హరితహారం, స్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించిన ఉత్తమ గ్రామ పంచాయతీల్లో  బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు చోటు దక్కలేదని ఎదురుదాడికి దిగారు.

కాంగ్రెస్‌ కు చుర‌క‌లు

యాభై ఏళ్లు అధికారంలో ఉన్న ప్రజలకు ఏమి చేయలేని పార్టీ నేతలు.. సొంత నియోజకవర్గం అమేథిలో పార్టీని గెలిపించుకోలేని నేతలు(రాహుల్‌) కూడా ఒక్క అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రజలను కోరడం హాస్యస్పదంగా ఉందన్నారు.  అలాంటి నాయ‌కుల‌ను న‌మ్మితే.. న‌ట్టేట మున‌గ‌డం కాయ‌మ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News