ఒక్క చోట గెలిచి పీఠం దక్కించుకున్న టీడీపీ

Update: 2019-06-08 14:11 GMT
తెలంగాణలో పట్టు కోల్పోయి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ప్రభావం చూపించిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఉనికిని కోల్పోయి కష్టాలను ఎదుర్కొంటోంది. దీనికితోడు, ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఓటమి పాలవడంతో తెలంగాణలో ఆ పార్టీ కష్టాలు రెట్టింపయ్యాయి. చంద్రబాబు కూడా ఇక్కడ పార్టీని లైట్ తీసుకోవడంతో ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన టీడీపీ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఊహించని విధంగా ఒక చోట ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. అది కూడా ఒకే ఒక్క ఎంపీటీసీతో కావడం విశేషం.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం దక్కింది. జిల్లాలోని ఏన్కూరు మండలంలో మెజారిటీ ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పోటీపడగా.. ఎంపీపీ మాత్రం టీడీపీ దక్కించుకుంది. ఈ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ ఎస్‌ మూడు స్థానాలు, కాంగ్రెస్‌ మూడు, సీపీఎం ఒకటి, టీడీపీ ఒక స్థానాన్ని, ఇండిపెండెంట్లు రెండు స్థానాలను దక్కించుకున్నారు. కాగా.. ఎంపీపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన విపక్ష, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు టీడీపీకి ఎంపీపీ అప్పగించారు. కాంగ్రెస్‌ పార్టీకి వైస్‌ ఎంపీపీ, సీపీఎంకు కో-ఆప్షన్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీడీపీ తరపున గెలిచిన ఆరెం వరలక్ష్మీని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విజయంతో ఖమ్మంలో ఆ పార్టీ బలం అలాగే ఉందని తేలింది.

గత డిసెంబర్‌ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమిలో భాగస్వామి అయింది. ఆ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పదమూడు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. అది కూడా టీడీపీకి కొంత పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. ఆ జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్రావు గెలుపొందారు. తర్వాత మారిన సమీకరణలతో ఆ పార్టీకి సండ్ర రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మండలిలోనైతే ఒక్కరు కూడా ఆ పార్టీ సభ్యులు లేరు.
Tags:    

Similar News