టీడీపీకి ఆ పాయింట్ ఇబ్బందిక‌ర‌మే.....

Update: 2015-08-05 05:08 GMT
తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీగా ఉన్నందున ఆ పార్టీ వైఖ‌రిపై అక్క‌డి ప్ర‌జ‌లు స‌హా రాజ‌కీయ వేత్త‌ల్లోనూ కొన్ని అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో ఉన్న ఆ అంచనాల‌ను అందుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఇపుడు ఆ అంచ‌నాలే టీడీపీకి చిక్కుల‌ను తెచ్చిపెడుతున్నాయి.

సెక్షన్‌-8 పై ఓ రేంజ్‌ లో పోరాటం చేసిన ఏపీ మంత్రులు... ప్రత్యేక హోదాపై ఆ స్థాయిలో ఎందుకు పోరాడటంలేదు? సెక్షన్‌-8  డిమాండ్‌ పై పెట్టిన శ్రద్ధ... స్పెషల్‌ స్టేటస్‌ పై ఎందుకు చూపట్లేదు? ఇలాగే వదిలేస్తారా? పోరాటాలు చేస్తారా?  రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఆస‌క్తిక‌ర చర్చ ఇది.

కొన్ని రోజులు వెనక్కి వెళ్తే... హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుపై టీడీపీ నేతలంతా ఓ రేంజ్‌లో పోరాటం చేశారు. సెక్షన్‌-8 డిమాండ్‌ని బలంగా వినిపించారు. ఓ దశలో గవర్నర్‌పైనే విరుచుకుపడ్డారు. సెక్షన్‌-8పై కేంద్రం ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుందన్న దాంతో సంబంధం లేకుండా తమ శక్తికి మించి పోరాటం చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దల్ని కలిసి  వినతిపత్రాలిచ్చారు. ఎంపీ నుంచి ఎంపీటీసీ వరకు సెక్షన్ 8పై పట్టుబట్టారు. ఇదంతా గతం.

పార్లమెంట్‌ సాక్షిగా ఓ కేంద్రమంత్రి... ప్రత్యేక హోదా కష్టమని చేసిన ప్రకటన ఒక్క సారిగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆంధ్రా అభిమానుల‌ను పెద్ద ఎత్తున క‌లిచివేసింది. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అధికారపక్ష నేతలు ఆ స్థాయిలో ఎందుకు దృష్టిపెట్టటంలేదన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న తర్వాత ఏపీకి  పెట్టుబడులు, భారీ స్థాయి ప‌రిశ్రమ‌లు రాలేదు.  ప్రత్యేక హోదా వ‌స్తే రాయితీలు వ‌స్తాయి. టాక్స్ మిన‌హాయింపు  ఉంటుంది. త‌ద్వారా ఆ మేర‌కు కంపెనీలు, పారిశ్రామిక‌వేత్త‌లు వ‌స్తారు. కానీ స్పెష‌ల్ స్టేట‌స్‌ పై నీలినీడ‌లు క‌మ్ముకోవ‌డం దీనికి అడ్డంకిగా మారింది.

తాజా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో అయినా టీడీపీ శ్రేణులు మ‌రింత దూకుడుగా ముందుకువెళ్లాల‌ని, సెక్ష‌న్ 8పై చూపిన ఆస‌క్తిని ఇపుడు కూడా క‌న‌బ‌ర్చాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News