జనసేన వల్ల దెబ్బ పడుతుందని ఫిక్స్ అయిన టీడీపీ!

Update: 2019-04-24 07:59 GMT
ఈ విషయాన్ని పరిశీలకులు మొదటి నుంచి చెబుతున్నారు. జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీల్చడం ఏమో కానీ తెలుగుదేశం ఓటు బ్యాంకుకు మాత్రం భారీగా చిల్లు పెడుతుందని అనేక మంది చెబుతూ వచ్చారు. ప్రత్యేకించి గత ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి పోల్ అయిన ఓట్ల లెక్కలను తీసుకుంటే.. ఈ సారి తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పి జనసేన పోటీ చేయడం చంద్రబాబును దెబ్బతీసే అంశమే అని అనేక మంది విశ్లేషిస్తూ వచ్చారు.

పోలింగ్ పూర్తి అయ్యాకా జరుపుకున్న సమీక్షలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే అభిప్రాయానికి వచ్చిందట. జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల దెబ్బ పడుతుందనే లెక్కలకు వచ్చారట తెలుగుదేశం వాళ్లు. జనసేన ప్రభావం కనీసం ముప్పై సీట్లకు పైనే ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీ ఒక అంచనాకు వచ్చినట్టుగా భోగట్టా.

అంటే ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును జనసేన చీల్చింది.. అని తెలుగుదేశం వారు తమకు తాము అంచనాకు వచ్చారని సమాచారం. నియోజవకర్గాల వారీగా - ప్రతి బూత్ నుంచి ఓటింగ్ వివరాలను తెప్పించుకుని చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమీక్షలో జనసేన ప్రభావం గురించి ఈ మేరకు అంచనాకు వచ్చారట.

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రచారం చేశారు. దాని ఫలితంగా టీడీపీకి ఎంతో మేలు జరిగింది. ఈ సారి పవన్ పార్టీ సొంతంగా పోటీ చేయడంతో అప్పుడు టీడీపీకి కలిసి వచ్చిన ఓటు బ్యాంకు అంతా పవన్ వెంట వెళ్లిపోయిందిప్పుడు. జనసేన పోటీ చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా కొంత వరకూ అటు వైపు మళ్లినా..

తెలుగుదేశం పార్టీకి మాత్రం జనసేన వల్ల డబుల్ లాస్ అని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. పోస్ట్ ఎనాలిసిస్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ అభిప్రాయానికే వచ్చిందట. జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఒక అంచనాకు వచ్చారట. మరి అసలు  కథ ఏమిటనేది మే ఇరవై మూడున తేలనుంది!
   

Tags:    

Similar News