శారదా పీఠం స్వాములోరి మీద సంచలన ఆరోపణలు చేసిన స్వాములోరు

Update: 2020-06-06 03:45 GMT
రాజకీయాల్లో ఒక నేత మీద మరో నేత ఆరోపణలు.. విమర్శలు చేసుకోవటం కామన్. అందుకు భిన్నంగా అధ్యాత్మిక రంగంలో ఉన్న వారిపై ఘాటు విమర్శలు చేయటం.. సంచలన ఆరోపణలు చేయటం చాలా అరుదు. తాజాగా అలాంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమితంగా ప్రాధాన్యత ఇచ్చే విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి. సంచలనంగా మారిన ఆయన ఆరోపణల్లో కీలకమైనది.. స్వరూపానందస్వామికి ప్రభుత్వాలను బ్లాక్ మొయిల్ చేయటంగా చెప్పారు.

ఒక చానల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసానంద స్వామి చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. తిరుమల కొండ మీద అన్యమత ప్రచారం జరిగినా స్వరూపానంద పట్టించుకో లేదని మండి పడ్డారు. తిరుమల కొండ మీద స్వరూపానంద స్వామి పీఠం పెట్టుకొని ఏం దైవకార్యాలు చేస్తారో చెప్పాలన్న ఆయన.. తిరుమలలోని పీఠాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయన్నారు.

ఇంత తీవ్రంగా తనపై వచ్చిన ఆరోపణలకు స్వరూపానంద స్వామి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. జగన్ సర్కారు కొలువు తీరిన తర్వాత దేవాలయాలపై దాడులు పెరిగినట్లుగా ఏపీ సాధుసమితి అధ్యక్షులు ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు దేవాలయ భూముల్ని వాడుకుంటున్నారన్న ఆయన.. ఇతర ప్రార్థనామందిరాలకు ప్రభుత్వం స్థలాలు ఇస్తోందన్నారు. అధ్యాత్మిక రంగానికి చెందిన వారిపై ఘాటు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News