సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్ !

Update: 2020-09-29 10:10 GMT
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం నుండి యావత్ సినీ లోకం ఇంకా తేరుకోలేదు. ఎస్పీ బాలు మరణాన్ని సంగీత అభిమానులే కాదు.. సినీ ప్రపంచమే ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఎస్పీ బాలు మన ముందు లేకప్పటికీ, ఆయన తన పాటల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు అని సినీ అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే సంగీత ప్రపంచానికి ఎన్నో సేవలు చేసిన ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని, భారతరత్న అవార్డుకు కేంద్రానికి సీఎం జగన్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఎస్పీ చరణ్ కు ఏపీ సీఎం కార్యాలయం నుంచి లేఖ కూడా అందింది.  

తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను భారతరత్న అవార్డు ఇవ్వాలని లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కు  ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ‌ భారతరత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం అందగానే ఎంతో సంతోషించానని  నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని అన్నారు. ఇక మరోవైపు  సీఎం జగన్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ బాలుకు భారత రత్న కోసం ప్రతిపాదించడంపై ఆయన ట్విట్టర్ ద్వారా  స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎస్పీ బాలు కోసం మీరు చేసిన వినతి చాలా గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు.. దేశమంతా ఉన్న ఎస్పీ బాలు అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తారు.. అంటూ కమల్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
Tags:    

Similar News