చేతబడి చేయించాడన్న అనుమానంతో ఐటీ ఉద్యోగిని తగలబెట్టేశారు

Update: 2020-11-24 04:30 GMT
షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో ఇప్పటికి మూఢ నమ్మకాల మీద నమ్మకంతో ఒక ఐటీ ఇంజనీర్ ను గదిలో బంధించి సజీవ దహనం చేసిన దారుణం తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? లాంటి వివరాల్ని చూస్తే.. నోట మాట రాదంతే. కేవలం అనుమానం అన్న పిశాచి ఒంట్లో దూరేసి.. ఈ దారుణానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.                                                                    
జగిత్యాల జిల్లాలోని బల్వంతాపూర్ శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అల్వాల్ కు చెందిన 38 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పవన్ కుమార్ సజీవదహనం ఉదంతంలో బలయ్యాడు. ఎందుకిలా అంటే.. పవన్ కుమార్ బావ మరిది విజయ్. అతడి సోదరుడు జగన్ పన్నెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చిన బావమరిదిని పలుకరించేందుకు పవన్ కుమార్ అతని భార్య కృష్ణవేణితో కలిసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లారు. అయితే.. తన భర్తను చేతబడి చేసి పవన్ కుమార్ చంపించాడని జగన్ భార్య.. అతని బంధువులు అనుమానించారు.

దీంతో పవన్ ను ఒక గదిలో బంధించి.. అతడి ఒంటి మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. పెద్ద ఎత్తున అరుపులు.. కేకలు వేస్తున్న అతడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. అప్పటికే పవన్ పూర్తిగా కాలిపోయాడు. దీనిపై పవన్ సతీమణి ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News