వైకాపా వైపు.. శిల్పా చూపు?

Update: 2017-04-26 10:43 GMT
తెలుగుదేశం సీనియర్ నాయకుల్లో ఒకరైన శిల్పా మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన వైకాపా వైపు మళ్లాలని భావిస్తున్నట్లుగా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని.. ఉప ఎన్నికలో టికెట్ కోరుకున్నందుకు తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని శిల్పా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు జరిపారని.. లెక్కలు చూపని నగదును.. ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారని తాజాగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

దీనిపై శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అబద్ధమని.. నంద్యాల టికెట్ కోరుతున్న నేపథ్యంలో తన గురించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇది భూమా కుటుంబ వర్గీయులు.. అనుచరుల పనే ఆయన ఆరోపిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తనను అభ్యర్థిగా నిలబెడితే కచ్చితంగా గెలుస్తానని అంటున్న ఆయన.. టికెట్ దక్కని పక్షంలో వైకాపా నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఐతే చంద్రబాబు మాత్రం భూమా కుటంబానికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి.. శిల్పా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News