షేక్‌పేట తహసీల్దార్ భర్త ఆత్మహత్య !

Update: 2020-06-17 06:45 GMT
బంజారాహిల్స్ ‌లోని కోట్ల రూపాయాల విలువైన‌ భూ వివాదం కేసులో చిక్కుకుని, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన షేక్‌ పేట్‌ తహశీల్దార్‌ సుజాత భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తహశీల్దార్ సుజాత భర్త అజయ్ కుమార్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ భూవివాదం, ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఇటీవలే పోలీసులు సుజాతను అరెస్ట్ చేశారు. గతంలో ఏసీబీ అధికారులు సుజాత భర్తను కూడా విచారించారు.

ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న అజయ్ కుమార్ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లారు. అక్కడే ఐదు అంతస్థుల భవనం మీది నుంచి బలవన్మరణానికి పాల్పడ్డారు. అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నం.14 లోని రూ. 40 కోట్ల విలువైన భూమి కేసులో లంచం తీసుకున్నట్లు తేలడం, ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో.. షేక్ ‌పేట తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు  జూన్ 8న అరెస్ట్ చేశారు. 
Tags:    

Similar News