భయానకం..యుద్ధంలో ఆకలి తట్టుకోలేక మనుషులను తింటున్నారా?
ఈ ఆరోపణల్లో అత్యంత కలవరపెట్టే ఘటన 2025 నవంబర్లో డోనెట్స్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఒక రష్యా సైనికుడు తనతోటి ఇద్దరు సైనికులను దారుణంగా హత్య చేశాడు.;
ఉక్రెయిన్ యుద్ధభూమిలో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి నిదర్శనంగా అత్యంత భయంకరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరాటం కేవలం క్షిపణులు, డ్రోన్లకే పరిమితం కాకుండా.. ఆకలి కేకలు, నరమాంస భక్షణ వంటి అమానవీయ ఘటనలకు వేదికగా మారుతోంది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ది సండే టైమ్స్ ప్రచురించిన తాజా కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.
యుద్ధభూమిలో ఆకలి దహనం.. నరమాంస భక్షణపై వెలుగులోకి సంచలన నిజాలు
ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోరాడుతున్న రష్యా సైనికులు ఆహారం అందక, సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర అల్లాడిపోతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే వారు తమ ప్రాణాలను నిలుపుకోవడానికి తోటి సైనికుల మాంసాన్ని తినడానికి కూడా వెనుకాడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉక్రెయిన్ నిఘా వర్గాల వెల్లడి
ఉక్రెయిన్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. కనీసం ఐదు సందర్భాల్లో రష్యా సైనికులు నరమాంస భక్షణకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. యుద్ధ క్షేత్రంలో సైనికులకు కనీస ఆహార వసతులు లేకపోవడం.. గడ్డకట్టే చలి, మానసిక ఒత్తిడి వారిని ఈ స్థితికి దిగజార్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా రష్యా సైన్యంలో క్రమశిక్షణ లోపించడం, బలవంతంగా యుద్ధంలోకి నెట్టబడిన వ్యక్తులు సరైన శిక్షణ, ఆహారం లేక ఇలాంటి దారుణ నిర్ణయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
డోనెట్స్క్ లో జరిగిన భయంకర ఘటన
ఈ ఆరోపణల్లో అత్యంత కలవరపెట్టే ఘటన 2025 నవంబర్లో డోనెట్స్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఒక రష్యా సైనికుడు తనతోటి ఇద్దరు సైనికులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం వారి మృతదేహాలను ఆహారంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ దళాలు అతడిని గుర్తించి కాల్చిచంపాయి. ఈ విషయాన్ని ఒక ఉన్నతాధికారి అధికారికంగా ధృవీకరించినట్లు సండే టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
యుద్ధరంగంలో ఇలాంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకోవడానికి కారణాలున్నాయి. ఉక్రెయిన్ దళాలు రష్యా సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకోవడంతో యుద్ధ క్షేత్రంలో ఉన్న సైనికులకు ఆహారం అందడం గగనమైంది. నెలల తరబడి యుద్ధంలో గడపడం, నిత్యం మరణాలను చూడటం వల్ల సైనికుల్లో 'యుద్ధ పిచ్చి' ఏర్పడి, విచక్షణ కోల్పోతున్నారు. రష్యా నుంచి రిక్రూట్ అయిన ఖైదీలు, సరైన శిక్షణ లేని వ్యక్తులు యుద్ధ క్షేత్రంలో మనుగడ సాగించడానికి ఇలాంటి క్రూరమైన పద్ధతులను అనుసరిస్తున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ స్పందన.. ప్రచార యుద్ధమా?
రష్యా ఇప్పటివరకు ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే యుద్ధ సమయంలో ప్రత్యర్థి సైన్యాన్ని మానసికంగా దెబ్బతీయడానికి ఇలాంటి వార్తలను ప్రచార యుద్ధం లో భాగంగా కూడా ఉపయోగిస్తారని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. యుద్ధ నేరాల జాబితాలో ఇలాంటి ఘటనలను చేర్చి స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం కేవలం భౌగోళిక సరిహద్దుల కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు.. అది మానవ విలువల పతనానికి దారి తీస్తోందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. నాగరిక ప్రపంచంలో ఇలాంటి నరమాంస భక్షణ వార్తలు రావడం మానవాళికే సిగ్గుచేటు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే ఆధునిక చరిత్రలో యుద్ధం సృష్టించిన అతిపెద్ద విషాదంగా ఇది నిలిచిపోతుంది.