ఆ ఎమ్మెల్యే మాట; ‘కొడితే పళ్లు రాలిపోతాయ్’

Update: 2016-07-30 15:36 GMT
ఎంత ఎమ్మెల్యే మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడొచ్చా? హద్దు మీరి మాటలుజారి చిక్కుల్లో చిక్కుకున్నారో ఎమ్మెల్యే. ఎదురుగా ఉన్నది మహిళా అధికారి అన్నది కూడా చూసుకోకుండా కోపంతో ఊగిపోతూ.. తన దర్పాన్ని ప్రదర్శించిన ఈ కర్ణాటక ఎమ్మెల్యే మాటలు ఇప్పుడు వివాదంగా మారటమే కాదు.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయ్.

కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే సతీష్ రెడ్డి రెచ్చిపోయారు. ఐఎఫ్ ఎస్ అధికారిని.. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గా వ్యవహరిస్తున్న దీపికా బాజ్ పాయ్ ను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. బెంగళూరు మహానగర కమిషనర్ మంజునాథతో కలిసి భారీ వర్షాలతో మునిగిపోయిన ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఆమెను చూసి చెలరేగిపోయారు.

వరదలు మీద పడటానికి ఆమె కారణం అన్నట్లుగా తిట్టేస్తే.. సిగ్గు లేదా? కొట్టానంటే పళ్లు రాలిపోతాయ్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరదలకు తమ నిర్లక్ష్యం వల్ల కాదని.. అక్రమ కట్టడాలు.. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కట్టడాల వల్లేనని చెబుతున్నా విరుచుకుపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే తీరును తప్పు పడుతూ.. సదరు అధికారిణి ఐఎఫ్ ఎస్ అధికారుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నోరు ఉంది కదా అని విరుచుకుపడితే.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మండిపడుతున్నారు అధికారులు.
Tags:    

Similar News