మందుబాబులకు సజ్జన్నార్ సీరియస్ వార్నింగ్

Update: 2020-11-14 05:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐపీఎస్ అధికారులు చాలామంది ఉన్నా.. కొందరు అధికారులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. ఆ కోవకే వస్తారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్. నిజాయితీ అధికారిగా.. ముక్కుసూటిగా వ్యవహరించటంతో పాటు.. కమిట్ మెంట్ ఉన్న పోలీసు అధికారిగా ఆయనకు మంచి పేరుంది. దిశ ఉదంతంతో ఆయన పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశాయి.

తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆసక్తికరంగా మారింది. దీపావళికి ఒక రోజు ముందుగా ఆయన మందుబాబులకు దిమ్మ తిరిగేలా వార్నింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మద్యం సేవించి వేగంగా వాహనాలు నడిపే వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెట్టి వదిలేసేవారు. ఇకపై అలా చేయమని.. కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

మద్యం సేవించి డ్రైవింగ్ చేసి.. ప్రమాదాలకు కారణమైన వారిపై ఐపీసీ 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసతామని స్పష్టంగా చేశారు. ఇటీవల కాలంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో పలువురు మరణించారు. ఈ ప్రమాదాలకు కారణం మితిమీరిన వేగం ఒకటైతే.. మద్యం సేవించి డ్రైవ్ చేయటం  మరో కారణంగా గుర్తించారు.

బాధ్యత లేకుండా తాగి వాహనాల్ని నడుపుతూ పలువురు ప్రాణాలు తీస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవటానికి వీలుగా ఈ ఆదేశాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఐపీసీ 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే.. పదేళ్లు జైలు లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టుల్లో సాక్ష్యాధారాల్ని సమర్పిస్తామని చెప్పారు. సో.. గతంలో మాదిరి తర్వాత చూసుకుందామన్న బరితెగింపునకు సజ్జన్నార్ తనదైన శైలిలో బ్రేకులు వేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News