దేశంలో ‘డేటా’ వార్ షురూ అయినట్లే..

Update: 2016-08-27 08:30 GMT
ఏదైనా బిజినెస్ లోకి  ముకేశ్ అంబానీ కానీ ఎంట్రీ ఇస్తుంటే.. వారి వైరివర్గం ఎంతలా వణుకుతారనటానికి తాజా పరిణామాలే నిదర్శనంగా చెప్పాలి. ఇంతకాలం ఒక జీబీ ఫోన్ డేటాను ఉపయోగించుకున్నందుకు దాదాపు రూ.150లకు పైనా ముక్కుపిండి వసూలు చేసిన టెలికం కంపెనీలు రిలయన్స్ జియో దెబ్బకు వణికిపోయే పరిస్థితి. ప్రస్తుతానికి టెస్టింగ్ పేరుతో.. జియో సిమ్ లు వినియోగించే వారికి మూడు నెలల పాటు ఎంతకావాలంటే అంత డేటాను అది కూడా 4జీ వేగంతో వాడుకోవచ్చని.. దీనికి జతగా మూడు నెలల పాటు ఎన్ని కాల్స్ అయితే అన్నికాల్స్ చేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇవ్వటం తెలిసిందే.

జియో ఆఫర్ తో.. ప్రస్తుతం ఆ సిమ్ ల కోసం షాపుల వద్ద క్యూలు వెలుస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. జియో ఎంట్రీ కారణంగా తమకు దెబ్బ పడటం ఖాయమన్న విషయాన్ని అర్థంచేసుకున్నటెలికం కంపెనీలు తమ రూటు మారుస్తున్నాయి. నిన్నటి వరకూ డేటా ఛార్జీలు భారీగా వసూలు చేసిన కంపెనీలు ఇప్పుడు ఆఫర్ల పేరుతో భారీగా తమ ధరల్ని తగ్గించేస్తున్నాయి. ఎవరి దాకానో ఎందుకు మొబైల్ కనెక్షన్లు ఎక్కువగా ఉంటాయన్న పేరున్న ఎయిర్ టెల్ తాజాగా తన డేటా చార్జీల్ని భారీగా తగ్గించేసింది.

జియోతో పోటీ పడేందుకు వీలుగా కేవలం రూ.250లకు 10 జీబీ మొబైల్ డేటాను వాడుకోవచ్చని సెలవిస్తోంది. అంటే.. ఒక జీబీ వినియోగానికి కేవలం రూ.25 మాత్రమే వసూలు చేస్తోంది. అది కూడా 4జీ స్పీడ్ మీదని ప్రకటించటం గమనార్హం. ఈ సంచలన ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే కాదని.. పాత వారికి కూడా అని ప్రకటించింది. 4జీ అందుబాటులో లేని వారికి ఇదే ఆఫర్ మీద 3జీ కూడా ఇస్తామని ప్రకటించింది. బ్రాండ్ లీడరే సంచలన ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో..మిగిలిన సెల్యూలర్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టొచ్చని చెబుతున్నారు. ఎయిర్ సంచలన ఆఫర్ తో దేశంలో ‘‘డేటా వార్’’ షురూ అయినట్లేనని చెప్పొచ్చు.
Tags:    

Similar News