రాహుల్ గాంధీతో సెల్ఫీ కోసం ఏం చేసిందో తెలుసా?

Update: 2017-11-01 16:59 GMT
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంచి జోరు మీదున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఓ తుంటరి అమ్మాయి సెల్ఫీ దిగింది. అది కూడా మామూలుగా కాదు. ఎవరి అనుమతీ లేకుండానే రాహుల్ వాహనంపైకి ఎక్కిన ఆమె చొరవగా ఆయనపై చేయేసేందుకు ప్రయత్నించింది. ఆయన తేరుకునేలోగానే తన వద్ద ఉన్న స్మార్టు ఫోను బయటకు తీసి చకాచకా సెల్ఫీ కూడా దిగింది.
    
బ‌రూచ్‌ ప్రాంతంలో రాహుల్ ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయ‌న వాహ‌నంపై ఉండగా ఓ యువ‌తి అంద‌రూ చూస్తుండ‌గానే వాహ‌నంపైకి ఎక్కేసింది. అయితే... రాహుల్ గాంధీ ఏమీ అనకపోవడంతో భద్రతా సిబ్బంది కూడా ఆమెను అడ్డుకోలేదు. దాంతో ఆమె వెంటనే ఒక సెల్ఫీ దిగి రాహుల్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి దిగిపోయింది.
    
కాగా గుజరాత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ తెగ ప్రచారం చేస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతా తానే అయి కలియతిరుగుతున్నారు. రాష్ఱ్టమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో దాన్ని అవకాశంగా తీసుకుని ఎలాగైనా గుజరాత్ ను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని రాహుల్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ర్టంలో తాము ఎలాగైనా అధికారం చేపడతామని రాహుల్ అంటున్నారు. మరి జనం చూపిస్తున్న ఈ అభిమానం ఓట్లుగా మారుతుందో లేదో చూడాలి.

Full View
Tags:    

Similar News