జగన్‌ పై రాహుల్ కన్ను

Update: 2017-12-24 04:30 GMT
యూపీ, బీహార్, అస్సాం, గుజరాత్, హిమాచల్... ఇలా ఏ ఒక్క చోటా కాంగ్రెస్‌కు పట్టు చిక్కడం లేదు. ఇన్నాళ్లూ ఏదో రకంగా జరిగిపోయింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడు. యువరాజు అధ్యక్షుడైన తరువాత అయినా ఏదో ఒక రాష్ర్టంలో గెలవకపోతే బీజేపీ కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ నిజమయ్యే పరిస్థితి వస్తుంది. దాంతో రాహుల్ గాంధీ భేషజాలను వదులుకుని పాత పరిచయాలన్నీ మళ్లీ బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఏపీలో వైసీపీ అధినేత జగన్‌తో కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
    
జగన్ తండ్రి వైఎస్ బతికున్న కాలంలో రాహుల్ కుటుంబానికి , రాజశేఖరరెడ్డి కుటుంబానికి మంచి దోస్తీ ఉండేది. కానీ, వైఎస్సార్ మరణం తరువాత  పరిణామాలు జగన్‌కు రాహుల్ కుటుంబానికి మధ్య దూరం బాగా పెంచేశాయి. జగన్ ఒక రకంగా సోనియాపై తిరుగుబాటు చేశారనే చెప్పాలి. అయితే... అవన్నీ మనసులోంచి తుడిచేసి మళ్లీ జగన్‌ను చేరదీయాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ర్ట విభజన పుణ్యం వల్ల ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు టీడీపీతో జతకట్టి బీజేపీ ఏపీలో ప్రభుత్వంలో కూర్చుంది. టీడీపీతో ఆ పార్టీకి మళ్లీ పొత్తు ఉంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని సీట్లు పెంచుకునే ఛాన్సూ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే జగన్ మద్దతు అవసరమని రాహుల్ గుర్తించారట.
    
నిజానికి ఏపీని ప్రస్తుతానికి పక్కన పెడదాం... చంద్రబాబు ప్రభుత్వంపై  వ్యతిరేకత వస్తే అదే తమ పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ తొలుత భావించింది. కానీ... వారు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. పైగా చంద్రబాబును కాదనుకున్నవారంతా జగన్ కు మద్దతు పలికే వీలుంటుందే కానీ కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి లేదు. మరోవైపు దేశంలో బీజేపీ 19 రాష్ర్టాల్లో పాగా వేసింది. కాంగ్రెస్ చేతిలో కేవలం నాలుగు రాష్ర్టాలున్నాయి. అందులో రెండు చిన్న రాష్ర్టాలు. మిగతావాటిలో పంజాబ్ ఒకటి.. అక్కడ ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరం కూడా కాలేదు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి కానీ, అక్కడ కాంగ్రెస్ మళ్లీ గెలవడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక తమిళనాడుపై ఆశలేదు, ఒడిశాలో ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా గొప్ప అన్నట్లుగా ఉంది. తెలంగాణలోనూ అద్భుతాలు సాధించడం కష్టమే. పైగా... తమతో జత కట్టడానికి అక్కడ వేరే పార్టీ కూడా లేదు.
    
ఇలాంటి పరిస్థితుల్లో అయితేగియితే అధికారంలోకి రావాలంటే ఏపీ ఒక్కటే కనిపిస్తోంది.. అంటే, కాంగ్రెస్ ఏపీలో గెలిచేస్తుందని కాదు, జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా... జగన్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఆ ప్రభుత్వంలో తామూ ఉండొచ్చన్నది ఆశగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తో సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకోవాలని రాహుల్ అనకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News