ఎన్నికల్లో గెలిచాక రఘు నందన్ తొలి ఇంటర్వ్యూ.. ఏమేం చెప్పారు?

Update: 2020-11-13 04:30 GMT
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా.. గులాబీ బాస్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన నేతగా రఘునందన్ ను చెప్పాలి. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ లాంటి దిగ్గజ నేతలు ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మధ్యలో ఉండే దుబ్బాకలో కాషాయ జెండా ఎగురవేసిన తీరు.. అసాధారణంగా చెప్పక తప్పదు. కలలో కూడా ఊహించని ఓటమికి కారణంగా రఘునందనరావే. సాధారణంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక నేత ఇంటర్వ్యూకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత ఇవ్వటం ఉండదు.

తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా రఘునందనరావు ఇంటర్వ్యూకు ప్రాధాన్యత పెరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన గంటల వ్యవధిలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన గెలుపు.. టీఆర్ఎస్ ఓటమికి కారణాల గురించి చెబుతూ.. ‘టీఆర్ఎస్ ఓటమి స్వయంకృతమే. మితిమీరిన అహంకారం. ఏం చేసినా చెల్లుతుందన్న దురహంకారంతోనే అధికార పార్టీకి ఎదురుదెబ్బ’ అని పేర్కొన్నారు. ఇంకేమన్నారంటే..

-  టీఆర్ఎస్ ముఖ్యనేతలు ముగ్గురు నన్ను నలిపేయాలని చూశారు.వారి వైఖరిని దుబ్బాక ఓటరు ఎండగట్టారు.
-  ఎన్నో ఒత్తిళ్లు.. ప్రలోభాలు.. చివరకు భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్లు మాత్రం అసాధారణ తీర్పు ఇచ్చారు.
-  ప్రచార వేళ నన్ను.. నా పార్టీ నేతలు.. కార్యకర్తల్ని ఎంతలా వేధించారో గుర్తించిన ప్రజలు.. నిశ్శబ్ద ఓటుతో సమాధానమిచ్చారు.
-  తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని..కార్యకర్తల్ని టీఆర్ఎస్ విస్మరించింది. డబ్బున్నోళ్లకే ప్రాధాన్యమిస్తోంది.
-  రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నాకు దుబ్బాక అనే మూడు అక్షరాలే ముఖ్యం.
-  కార్యకర్తల్ని నిత్యం కలుస్తుండటం.. అనుక్షణం నియెజకవర్గాన్ని కేంద్రంగా పెట్టుకొని పని చేయటమే గెలుపు రహస్యం.
-  గెలుపోటముల్ని సమానంగా స్వీకరించే శక్తి దేవుడు ఇచ్చాడు. ఓడినప్పుడు కాస్త ఎక్కువగా నిరాశ చెందిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అదృష్టం  దక్కింది.
-  దీపావళి తర్వాత నియోజకవర్గ డెవలప్ మెంట్ పై కార్యాచరణ ప్రణాళిక గురించి అధికారులతో చర్చిస్తా.
Tags:    

Similar News