ఆ రెండు స్థానాల్లో మోడీ పోటీ.. నిజ‌మెంత‌?

Update: 2023-01-08 06:37 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తు న్నాయి. ఈ ద‌ఫా ఆయ‌న ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి పోటీకి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు ఢిల్లీ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా బీజేపీ విస్తృత స్థాయి స‌మావేశంలోనూ దీనిపై దృష్టి పెట్టార ని తెలిసింది. పార్ల‌మెంట‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మోడీ ఇప్ప‌టికి రెండుసార్లు యూపీ నుంచి పోటీ చేశారు.

యూపీలో వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పార్ల‌మెంటు కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఫ‌లితంగా  ఉత్త‌రాదిన అప్ప‌టికే బ‌లంగా ఉన్న బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేశార‌నే టాక్ ఉంది. అదేస‌మ‌యంలో హిందూత్వ ప్రాతిప దిక‌న బీజేపీని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు కూడా మోడీకి అవ‌కాశం చిక్కింది. యూపీలో కొన్నేళ్లుగా ఉన్న రామ‌మందిర వివాదానికి ఆయ‌న చెక్ పెట్టారు.

అదేవిధంగా కాశీ క్షేత్రాన్ని డెవ‌ల‌ప్ చేయ‌డం ద్వారా.. బీజేపీ అజెండాను దాదాపు అమ‌లు చేసే ప్ర‌య త్నం చేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ద‌క్షిణాదిలో బీజేపీని ప‌రుగులు పెట్టించే క్ర‌మంలో మోడీ స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌, త‌మిళ‌నాడులోని రామ‌నాథ‌పురం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఏక‌కాలంలో పోటీ చేయ‌డం ద్వారా.. ద‌క్షిణాదిలో బీజేపీకి ఊపు తెప్పించే క్ర‌తువును మోడీ భుజాల‌కు ఎత్తుకున్నార‌ని అంటున్నారు. అయితే.. మోడీ గెలిచినంత మాత్రాన ఆయా రాష్ట్రాల్లో పార్టీ పుంజుకుంటుందా? అనేది కొంత ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే.. ప్రాంతీయ ప‌రంగా చూసుకుంటే.. తెలంగాణ‌లో ఉన్న స‌మస్య‌ల ప‌రిష్కారానికి బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది ఏమీ లేదు. ఇక‌, త‌మిళ‌నాడులో స్థానిక‌త‌కు పెద్ద‌పీట వేసే అక్క‌డి త‌మిళ‌లు బీజేపీని ఆద‌రించ‌డం అనేది అసాధ్య‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News