మోడీ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రాలేనా.. వ్యూహం స్టార్ట్ అయిందా?

Update: 2022-03-12 02:30 GMT
ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల అధికారంలోకి రావ‌డం.. అంటే మాట‌లు కాదు! పైగా క‌రోనా సృష్టించిన భీభ‌త్సం తాలూకు అనేక స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు మ‌ళ్లించుకోవ‌డం అంటే కూడా అంత ఈజీకాదు. అయినా.. మోడీ స‌క్సెస్ అయ్యారు. కేంద్రంలోని త‌న ప్ర‌భుత్వాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తూనే.. మ‌రోవైపు.. రాష్ట్రాల్లో పాగా వేసే దిశ‌గా ఆయ‌న వేసిన అడుగులు ఒక్కొక్క‌టిగా.. విజ‌యం సాధించి.. తాజాగా.. నాలుగు రాష్ట్రాల్లో అధికార పీఠం కైవ‌సం చేసుకున్నారు. దీనిలో అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌రుస విజ‌యాలు సాధించి స‌రికొత్త రికార్డును సృష్టించారు.

మ‌రి నెక్ట్స్ ల‌క్ష్యం ఏంటి?  ఇప్ప‌టికి ఎంతో సాధించారు క‌దా.. ఇక విశ్రాంతేనా? అంటే.. కానేకాద‌ని అంటున్నారు ప్ర‌ధాని మోడీ. `సాధించిన దానికి సంతృప్తిని చెంది.. అదే విజ‌య‌మ‌నుకుంటే.. పొర‌పాటోయి!` అని పాడుకుంటూ.. స‌రికొత్త ల‌క్ష్యాల‌ను నిర్దే శించుకుని ముందుకు సాగుతున్నారు. అవే.. మ‌రో రెండు రాష్ట్రాల్లో పాగా వేయ‌డం!! ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ స‌హా.. హిమాల‌య రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌పై ఇప్పుడు మోడీ దృష్టి పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గుజరాత్ శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగుస్తుంది.అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీకాలం జనవరి 8, 2023 తో ముగియ‌నుంది.

దీంతో..ప్ర‌ధాని మోడీ ఈ రాష్ట్రాల‌పై ఈ రోజు నుంచే దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో అధికారం కైవ‌సం చేసుకున్న నేప‌థ్యంలో, ముఖ్యంగా.. కాంగ్రెస్ అడ్ర‌స్ లేకుండా పోయిన త‌రుణంలో ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలోనే త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో రెండు రోజుల పాటు  పర్యటించ‌నున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా శుక్ర‌వారం నిర్వ‌హించిన రోడ్ షో.. త‌గ్గేదేలే! అన్న‌ట్టుగా సాగింది. మొత్తం 20 కిలో మీట‌ర్ల మేర అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యం నుంచి గాంధీన‌గ‌ర్‌లోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ర‌కు సాగిన రోడ్ షో.. లో దాదాపు 5 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు పాల్గొని ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ప్రధానమంత్రి వెళ్లే మార్గంలో దాదాపు 50 స్టేజీలతో పాటు రూట్ మొత్తం కాషాయ జెండాలతో నిండిపోయింది. రోడ్ షో తర్వాత, ప్రధాని మోడీ కమలం భవన్‌లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నాలుగు రాష్ట్రాల విజయోత్సవాన్ని గుజరాత్‌కు తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రధాని పర్యటన జ‌రిగింద‌ని మేధావులు చెబుతున్నారు.

ఇక‌, గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అందులోనూ.. మోడీ పాత్రే ముఖ్యం. ఆయ‌న గుజ‌రాత్‌లో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఓట‌మి అనేది లేకుండా పార్టీ ప‌రుగులు పెడుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీనే ఎదురైంది. కానీ, ఈ సారి కాంగ్రెస్ తో పాటుగా ఆప్ సైతం ఇక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. పంజాబ్ లో గెలిచిన ఆప్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. జాతీయ పార్టీగా అవతరించేందుకు గుజరాత్ లో ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. దీంతో..నాలుగు రాష్ట్రాల్లో గెలిచినా... విశ్రమించకుండా ప్రధాని గుజరాత్ పర్యటన మొదలు పెట్టారు. అదేవిధంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌పైనా దృష్టి పెట్టారు.
Tags:    

Similar News