శంకుస్థాపన కాదంట.. భూమిపూజ మాత్రమేనంట

Update: 2015-05-23 11:00 GMT
ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన జూన్‌ ఆరో తేదీన జరగనుందని.. దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏపీ సర్కారు భావిస్తోందన్న వార్తలు చాలానే వచ్చాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీని తీసుకొచ్చి.. ఆయన చేతుల మీద ఈ కార్యక్రమాన్ని జరపాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తలపోస్తున్నట్లు అంచనాలు వినిపించాయి.

అయితే.. వాటిల్లో నిజం లేదన్న విషయం.. శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాటల్ని చూసిన వారికి అర్థమైంది. జూన్‌ ఆరో తేదీన నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించటం లేదని.. రాజధానిలో నిర్మాణాలు జరిపిన తర్వాత మోడీని పిలుద్దామని సహచర మంత్రులతో మాట్లాడటం తెలిసిందే.

మంత్రివర్గంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బయటకు పొక్కటం.. మోడీని పిలవకుండానే శంకుస్థాపన కార్యక్రమం చేపడతారా? అన్న విస్మయం వ్యక్తమైంది. నిధుల విషయంలో కానీ.. మరే విషయంలోనైనా ఏపీకి కేంద్రసర్కారు సాయం అవసరమైన సమయంలో.. శంకుస్థాపన లాంటి కీలక కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించకపోవటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

మరి.. దీని గురించి ఏమనుకున్నారో కానీ.. ఏపీ మంత్రి నారాయణ తాజాగా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జూన్‌ ఆరో తేదీ ఉదయం 8.45 గంటలకు నిర్వహించేది శంకుస్థాపన కాదని.. కేవలం భూమిపూజ మాత్రమేనని వెల్లడించారు. బోరుపల్లి నుంచి ఉండవల్లి వరకున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో భూమిపూజ ఎక్కడ నిర్వహించేది త్వరలో చెబుతామని చెప్పారు. సాధారణంగా శంకుస్థాపనకు.. భూమిపూజకు పెద్ద తేడా ఉండదన్న వాదన వినిపిస్తోంది. మరి.. శంకుస్థాపన స్థానంలో భూమిపూజ మాట ఎందుకు వచ్చినట్లు.. చెప్మా..?


Tags:    

Similar News