మూసా పొట్టలో 600 గ్రాముల డ్రగ్స్

Update: 2015-09-01 09:38 GMT
కడుపు నిండా డ్రగ్స్ పెట్టుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా మహిళ మూసా పొట్టలో నుంచి మొత్తం డ్రగ్స్ ను బయటకు తీశారు. మొదట ఆమె పొట్ట లో 24 ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించినా.. ఆ తర్వాత ఆమె పొట్టలో మొత్తం 51 సంచీలు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. ఆమె పొట్టలో ఉన్న మొత్తం డ్రగ్స్ బరువు 600గ్రాములుగా తేలింది.

జోహాన్స్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా.. హైదరాబాద్ వచ్చిన మూసాను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో ఆమె నడక అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేసినప్పుడు ఆమె పొట్ట లోపలి రహస్యం బయటకు రావటం తెలిసిందే.

గత మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి.. ఆమె పొట్టలోని మొత్తం 51 సంచీల (చిన్నచిన్నవి)ను వివిధ మార్గాల్లో బయటకు తీసిన వైద్యులు.. చివరగా మరోసారి క్షుణ్ణంగా స్కాన్ చేసి ఆమె పొట్టలో ఏమీ లేదని తేల్చుకున్నాక ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమెను పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి.. మూసాతో తీగ కదిలిస్తే.. హైదరాబాద్ లోని డ్రగ్ రాకెట్ డొంక కదలటం ఖాయం. మరి.. ఆ పని పోలీసులు ఎంతవరకు చేస్తారో చూడాలి.
Tags:    

Similar News