ప్రణబ్ క్లారిటీ.. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ?

Update: 2017-05-26 08:38 GMT
రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ మళ్లీ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే... దీనిపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు.  ఢిల్లీలో జరిగిన రామనాథ్‌ గోయంకా లెక్చర్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్.. తాను మళ్లీ పోటీ చేయడం లేదని తేల్చేశారు. తాను రాష్ట్రపతి పదవిలో కచ్చితంగా రెండు నెలలే ఉంటానన్నారు. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతి వస్తారని స్పష్టం చేశారు.
    
దేశం ఉజ్వలంగా ముందుకుసాగాలా లేక సంకుచిత ధోరణులతో ముందుకు సాగాలో భారతీయులే తేల్చుకోవాలన్నారు. భారత్‌ లో భిన్నవాదనలకు ఆస్కారం ఉంది కానీ సహన రాహిత్యానికి మాత్రం లేదన్నారు. పరోక్షంగా దేశంలో జరుగుతున్న మతఘర్షణలు, దాడులను ఆయన ప్రస్తావించారు.  ప్రజాస్వామ్య సమాజ పరిరక్షణకు అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత సమస్యలు తప్ప ఇతరులని విస్మరించడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
    
కాగా రాష్ర్టపతి ఎన్నికలకు విపక్షం కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి ఎవరూ దొరకడం లేదు. వారు ప్రతిపాదించే అభ్యర్థులకు ఇతర విపక్షాలు అన్నిటి నుంచి ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో ప్రణబ్ నే మళ్లీ పోటీ చేయిస్తే అంతా మద్దతిస్తారని కాంగ్రెస్ భావిస్తోందని... ప్రణబ్ పోటీ ఖాయమని ఒక ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆయన దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ విషయం క్లోజ్ అయినట్లే అయింది. కాంగ్రెస్ ఇక కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News