హ్యాండిచ్చిన 'పవార్'...శివసేనకు నో పవర్

Update: 2019-11-19 08:51 GMT
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హ్యాండిచ్చారు.  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము అసలు చర్చించలేదని సంచలన కామెంట్ చేశారు. శివసేనతో పొత్తును సోనియాగాంధీ వ్యతిరేకించారా అని విలేకరులు ప్రశ్నిస్తే అసలు ఆ విషయమే చర్చించలేదని.. కాంగ్రెస్-ఎన్సీపీ అంశాలనే చర్చించామని తెలిపారు. దీంతో శివసేనతో పొత్తు కుదుర్చుకొని మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు యోచన నుంచి ఎన్సీపీ వైదొలిగినట్టు అయ్యింది.

ఇక ఎన్సీపీ - కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్ర సీఎం పీఠంపై కూర్చుందామని కలలుగన్న శివసేనకు గట్టి షాక్ తగిలింది. సోనియాతో భేటి తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట మార్చడం శివసేనకు శరాఘాతంగా మారింది. శివసేనతో కలవడానికి కాంగ్రెస్-ఎన్సీపీ దూరంగా జరగడం మహారాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది.

ఇన్నాళ్లు శివసేనకు సీఎం.. డిప్యూటీ సీఎం ఎన్సీపీకి - స్పీకర్ పదవి కాంగ్రెస్ కు సహా మంత్రి పదవుల పంపకాలు కూడా పూర్తైన తరుణంలో సోనియా-శరద్ పవార్ భేటి శివసేన ఆశలను చిదిమేసింది. ఏమైందో ఏమో కానీ సోనియా గాంధీ శివసేనతో పొత్తు - ప్రభుత్వ ఏర్పాటు నుంచి వైదొలగడం సంచలనంగా మారింది.

ఇక ఎన్సీపీ దూరం జరగడంతో శివసేన సైతం స్పందించింది. తాము తమ సామీప్య పార్టీలతోనే జతకడుతామని కాంగ్రెస్ - ఎన్సీపీలతో ఇక పొత్తులు ఉండవని ప్రకటించింది. దీంతో బీజేపీతో దోస్తీకి మళ్లీ శివసేన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక తాజాగా మూడేళ్లు బీజేపీ-రెండేళ్లు శివసేన సీఎం కుర్చీ పంచుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనిపై బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తే మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరుతుంది.లేదంటే రాష్ట్రపతి పాలనే కొనసాగుతుంది..

   

Tags:    

Similar News