పూరీలో కరోనా కలకలం.. రథయాత్రే కొంపముంచిందా?

Update: 2020-09-29 17:30 GMT
కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని ప్రముఖ ఆలయాలపై పడింది. తిరుమలలో ఏకంగా 1700 మంది సిబ్బంది వైరస్ బారిన పడి కోలుకోగా,  మహారాష్ట్ర లోని షిర్డీలో కూడా దర్శనాలను నిలిపి వేశారు. ఇప్పుడు మరో  ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ క్షేత్రం కరోనాతో విలవిలలాడుతోంది. ఇప్పటికే అక్కడ మొత్తం 400 మందికి కరోనా సోకిందట. దీంతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాక్​డౌన్​ నుంచి పూరీ  ఆలయాన్ని మూసే ఉంచారు. కేవలం కొద్ది మంది అర్చకులతో నిత్యపూజలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్ప సంఖ్యలో సిబ్బందితో రథోత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే దేశంలోని మిగతా ఆలయాలన్నీ ప్రస్తుతం తెరుచుకున్నాయి. దీంతో పూరీ జగన్నాథ ఆలయాన్ని కూడా తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది.

‘పూరీ దేవాలయంలో ఇప్పటివరకు 404 మందికి కరోనా సోకింది. వీరిలో 351 మంది సేవకులు, మరో 53 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది వివిధ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మిగతా వారంతా హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకొని కోలుకున్నారు’ అని ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన రథయాత్ర సందర్భంగా 822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్​ సోకింది. కానీ ఆ తర్వాతే పరిస్థితి విషమించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అన్ని ప్రముఖ ఆలయాలు తెరిచారని ఇక్కడ కూడా భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తే వైరస్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News