ఎర్ర‌బుగ్గ‌కు మంగ‌ళం పాడేసిన మోడీ స‌ర్కార్‌

Update: 2017-04-19 14:35 GMT
ప్ర‌ధాని మోడీని అభిమానించాలా? ఆరాధించాలా? అదేమీ కాకుండా అస‌హ్యించుకోవాలా? అన్న ప్ర‌శ్న‌లు వేసి సూటిగా స‌మాధానం చెప్ప‌మ‌నండి. బాధ్య‌త‌గా బ‌దులిచ్చే వారెవ‌రూ ఈ ప్ర‌శ్న‌ల‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు. ఎందుకంటే.. మోడీలో చాలానే కోణాలు ఉంటాయి. కొన్ని కోణాల్లో ఆయ‌న నిర్ణ‌యాల్ని అభినందించాల్సిందే. మ‌రికొన్ని విష‌యాల్లో ఆయ‌న్ను వేలెత్తి చూపించ‌కుండా ఉండ‌లేం. మ‌రికొన్ని అంశాల్లో ఆయ‌న్ను తీవ్రంగా వ్య‌తిరేకించాల్సిందే. ఇలా చిత్ర‌మైన తీరు మోడీలో క‌నిపిస్తుంది. కొన్నిసార్లు ఎంత హుందాగా.. ఎంత డౌన్ టు ఎర్త్ గా వ్య‌వ‌హ‌రిస్తారో.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో అంతే అహంభావిగా క‌నిపిస్తుంటారు.

ఒక చిన్న పాప రాసిన ఉత్త‌రానికి స్పందించి సాయం అందించే మోడీ.. త‌న నివాసానికి ద‌గ్గ‌ర్లో రైతులు న‌గ్నంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తే.. అస్స‌లు ప‌ట్టించుకోరు. అంతేనా.. రోజుల త‌ర‌బ‌డి ఢిల్లీ రోడ్ల మీద ఒక రాష్ట్రానికి చెందిన రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నా అస్స‌లు ప‌ట్టించుకోరు స‌రిక‌దా.. అస‌లు అవి స‌మ‌స్య‌ల‌న్న‌ట్లుగా కూడా ప్ర‌స్తావించ‌రు. ఒక చిన్నారి సాయం కోసం అర్థిస్తే స్పందించే మోడీ.. కొంద‌రురైతులు త‌మ బాధ‌ల్ని నిర‌స‌న రూపంలో చెబితే ఎందుకు రియాక్ట్ కార‌న్నదే మోడీ స్టైల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇలా.. త‌న నిర్ణ‌యాల్లో భిన్న పార్శాలు ప్ర‌ద‌ర్శించే ఆయ‌న‌.. తాజాగా ఒక ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఈ రోజు జ‌రిగిన కేంద్ర‌మంత్రి వ‌ర్గ స‌మావేశంలో వీవీఐపీలంతా ఎంతో మోజుప‌డే బుగ్గ‌కార్ల‌కు మంగ‌ళం పాడేలా నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి.. ప్ర‌ధాని సుప్రీంకోర్టు ప్ర‌ధాన‌న్యాయ‌మూర్తితో స‌హా దేశంలో ప్ర‌ముఖులు ఎవ‌రూ ఎర్ర‌బుగ్గ‌ల్ని వినియోగించ‌కూడ‌ద‌ని నిర్ణయించారు. ఈ నిర్ణ‌యాన్ని మే 1 నుంచి అమ‌లు చేయాల‌ని డిసైడ్ చేశారు.

అదే స‌మ‌యంలో అంబులెన్స్ లు.. సైనిక‌.. పోలీసు అధికారులు మాత్రం త‌మ వాహ‌నాల మీద మాత్రం నీలం రంగు బుగ్గ‌ను కొన‌సాగించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక్క అత్య‌వ‌స‌ర వాహ‌నాలకు త‌ప్పించి.. మ‌రెవ‌రికీ బుగ్గ‌లు ఉండ‌కూద‌ని డిసైడ్ చేశారు. వీవీఐపీ క‌ల్చ‌ర్‌ లో ఎర్ర‌బుగ్గ ఉండ‌టం త‌మ హోదాకు చిహ్నంగా ప్ర‌ముఖులు భావిస్తుంటారు. అలాంటి హోదా మీద దెబ్బేసిన మోడీ తీరును అభినందించ‌కుండా ఉండ‌లేం.

నిజానికి ఈ త‌ర‌హా నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నారు కూడా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్‌.. పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌ లు ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నారు. వీరి నిర్ణ‌యాన్ని తీసుకున్న నెల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాని మోడీ.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. ప్ర‌ముఖ‌ల కార్ల‌కు బుగ్గ‌ల తొల‌గింపు నిర్ణ‌యం దేశ ప్ర‌జ‌ల్ని అమితంగా ఆక‌ర్షిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News