పాల‌కులు అవ‌న్నీ వ‌దులుకోవాల‌ని ప్రచారం చేయ‌రేం మోడీ?

Update: 2019-07-19 04:53 GMT
మీరు సంపాదించిన జీతానికి ఆదాయ‌ప‌న్ను పేరుతో కోత వేసి.. దానికి వృత్తి ప‌న్నుతో మ‌రింత పిండిన త‌ర్వాత‌.. ఇంటికి తీసుకెళ్లిన డ‌బ్బుల‌తో పప్పులు.. ఉప్పులు.. స‌బ్బులు.. పేస్టులు.. నిత్య‌వ‌స‌రాల‌తో పాటు.. బండిలో కాసింత పెట్రోల్ కొట్టించ‌టం మొద‌లు ఆసుప‌త్రిలో రోగం వ‌చ్చి వెళితే చేసే వైద్య సేవ‌ల వ‌ర‌కూ అన్నింటికి ప‌న్నుమోత మోగించే స‌ర్కారు.. ప‌న్ను విధించిన సొమ్ము మీద ఇన్నేసి ర‌కాలుగా ప‌న్నులు వేయ‌టం చూస్తే.. ఇన్ని ర‌కాలుగా బాద‌ట‌మా? అనిపించ‌క మాన‌దు.

ఇన్ని బాదుళ్ల త‌ర్వాత అయినా.. స‌రైన రోడ్లు.. తాగేందుకు శుభ్ర‌మైన నీళ్లు.. పీల్చేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన గాలి ఉంటుందా? అంటే ఎక్క‌డా క‌నిపించ‌దు. స‌ర్లే.. ఓట్లేసి గెలిపించిన దానికి ఇలాంటివాటిని సామాన్యుడు భ‌రించాల‌న్న వేళ‌లో.. ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించే తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగానే కాదు.. షాకింగ్ గా ఉంటుంది.

ప్ర‌భుత్వం నుంచి తాయిలాలు అందేవి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందునా పెద్దోళ్లు.. అదేనండి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు క‌ల్పించే వ‌స‌తులు అర‌కొర‌. వాటిని ప‌క్క‌న పెట్టేస్తే.. వారికిచ్చే రాయితీలు చాలా త‌క్కువ‌. నిజానికి ఎలాంటి ఆదాయం లేక.. ఇంట్లో పిల్ల‌ల‌పై ఆధార‌ప‌డే వృద్ధులు చాలామందే ఉంటారు. అలాంటి వారికి అంతో ఇంతో మేలు క‌లిగించే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలకు వ‌స్తే.. రాయితీ మీద ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో ప్ర‌యాణించే అవ‌కాశం.

వ‌య‌సు మీద ప‌డిన త‌ర్వాత ఆర్థిక‌శ‌క్తి  త‌గ్గుతుంది. బాగా సెటిల్ అయిన వారిని మిన‌హాయిస్తే.. పిల్ల‌ల మీద ఆధార‌ప‌డే పెద్దోళ్లు ఎక్కువే ఉంటారు. అలాంటి వారికి 50శాతం టికెట్ రాయితీ అస‌రాగా నిలుస్తోంది. తాజాగా.. పెద్దోళ్ల‌కు క‌ల్పించే టికెట్ రాయితీని వ‌దులుకోవాలంటూ ప్ర‌చారం మొద‌లు పెట్ట‌టంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ప్ర‌చారం ఎమోష‌న‌ల్ బ్లాక్ మొయిల్ త‌ర‌హాలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది.అంత‌కంత‌కూ పెరుగుతూ పోతున్న పాల‌కుల వ‌స‌తులు..ప్ర‌జాప్ర‌తినిధుల బిల్లుల్లో కోత పెట్టుకోవ‌ట‌మో.. వారికి క‌ల్పించే రాయితీల్ని వ‌దులుకోవాల‌న్న ప్ర‌చారం చేయ‌ని ప్ర‌భుత్వం.. పెద్ద‌వాళ్ల‌కు క‌ల్పించే రాయితీ మీద క‌న్నేయ‌టం బాగోలేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాను తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ్యాస్ బండ మీద ప్ర‌భుత్వం ఇచ్చే రాయితీని మిన‌హాయించుకోవాల‌ని పెద్ద ఎత్తున  ప్ర‌చారం చేయ‌టం.. దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని లక్ష‌ల్లో స్పంద‌న రావ‌టం తెలిసిందే. ఇలా ప్ర‌జ‌లు చేసే త్యాగాల‌తో దేశ అప్పు తీర‌టం లేదు.. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న సమ‌స్య‌లు త‌గ్గ‌టం లేదు. అలాంట‌ప్పుడు ప్ర‌జ‌లే ఎందుకు త్యాగం చేయాలి మోడీజీ?
Tags:    

Similar News