బాబుకు షాకిచ్చేలా మోడీ కామెంట్లు

Update: 2017-12-05 16:42 GMT
ఇటీవ‌ల లుక‌లుక‌ల‌కు వేదిక‌గా మారుతున్న బీజేపీ, టీడీపీల మ‌ధ్య మిత్ర‌బంధంలో మ‌రో షాకింగ్ ప‌రిణామం చోటుచేసుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టుకు బ్రేకులు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా మ‌రో రూపంలో షాకిచ్చార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు రూపంలో చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డుతుండ‌గా..మ‌రో షాక్ ఏంట‌నే క‌దా మీ సందేహం...చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చి ఇటీవ‌ల‌ నిల‌బెట్టుకున్న హామీ!

ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే..ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 2014 ఎన్నిక‌ల హామీని మూడున్న‌రేళ్ల‌పాటు సాగ‌దీసిన త‌ర్వాత దానికి మోక్షం క‌లిగించారు. బీసీ-ఎఫ్ కోటాలో కాపుల‌కు 5శాతం కోటాకు ఓకే చెప్పేశారు. రాష్ట్ర మంత్రివ‌ర్గం - అసెంబ్లీ తీర్మానం చేసి..హ‌మ్మ‌య్య నా ప‌ని అయిపోయింద‌ని చేతులు దులుపుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామంపైనే స‌రిగ్గా మోడీజీ షాకిచ్చార‌ని అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి త‌నదైన శైలిలో తేల్చిచెప్పేశారు. దేశంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ఎవ‌రైనా 50కి మించినా కూడా తాము రిజర్వేషన్లు క‌ల్పిస్తామని అంటే అది నిజం కాదని తేల్చిచెప్పారు. 55 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీ అవుతుందని ప్ర‌ధాన‌మంత్రి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఈ కామెంట్లు చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ప్ర‌ధాని వివ‌రించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాబైశాతం పరిమితిని దాటే ఉద్దేశం తమకు లేదని కూడా ప్రధాని తేల్చి చెప్పారు. ప్రధాని ఇంత స్పష్టంగా మాట్లాడటం, పైగా సుప్రీం కోర్టు ఆదేశాలను ఉదహరించడం కేవ‌లం గుజ‌రాత్‌కే ప‌రిమితం కాదంటున్నారు. గుజ‌రాత్‌లో ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల‌ను, రాజస్థాన్ ప్రభుత్వం ఝాట్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవ‌డం, ఏపీ స‌ర్కారు కాపుల కోటా వంటివ‌న్నీ ఇందులో భాగ‌మ‌ని చెప్తున్నారు. ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న ఖ‌చ్చితంగా సీఎం చంద్ర‌బాబుకు షాక్ వంటిదేన‌ని అంటున్నారు. ఎన్నిక‌ల హామీని నిలుపుకున్నాం...కాపు రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులో వేసేశాము...ఇక లాభమో నష్టమో వారి ద్వారానే అనేలా తెలుగుదేశం పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్న‌ప్ప‌టికీ...టీడీపీ స‌ర్కారుకు ప్రధాని మోడీ వ్యాఖ్యలు షాక్ వంటివేన‌ని అంటున్నారు. అంతేకాదు...ఈ వ్యాఖ్య‌లు తెలంగాణ సీఎం కేసీఆర్ర్‌కు కూడా షాక్ వంటివ‌ని అంటున్నారు. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల విష‌యంలో సీఎం కేసీఆర్ దూకుడుగా వెళ్తున్న‌ప్ప‌టికీ అదంతా కుద‌ర‌ద‌ని ప్ర‌ధాని మోడీ మాటలతో స్పష్టమైపోయిందని అంటున్నారు.

సంద‌ర్భం ఏదైనా తాజాగా మోడీజీ కామెంట్లు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏ మాత్రం మింగుడు ప‌డ‌నివ‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. చంద్రబాబుని మోడీ టార్గెట్ చేసినా చెయ్యకపోయినా ఆ మాటలైతే చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేవే కదా అని విశ్లేషణలు చేస్తున్నారు. కానీ ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు మాత్రం మోడీ కామెంట్లు బాబుకు షాక్ వంటివ‌ని అంటున్నారు. మోడీ మాటల ప్రకారం చంద్రబాబుది తప్పుడు హామీనే అని తేలిపోయినట్లే కదా అని విశ్లేషిస్తున్నారు. స్థూలంగా బాబు కొరియా నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఈ విష‌య‌లో స్ప‌స్ట‌త వ‌స్తుంద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News