లోకేశా... ఈ ల‌క్ష‌ల ఉద్యోగాలేందీ?

Update: 2017-07-14 09:21 GMT
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి కుమారుడిగా రాజ‌కీయ తెరంగేట్రం చేసిన ఏపీ ఐటీ - పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ నిజంగానే స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా... ఏ స‌భ‌లో మాట్లాడినా... ఏదో ఒక వివాదం ఆయ‌న‌ను చుట్టుముడుతూనే ఉంది. త‌న నాలిక మ‌డత‌తోనే కాకుండా... జ‌ర‌గ‌ని ప‌నుల‌ను కూడా జ‌రిగిన‌ట్లుగా, ఒక్క ప్ర‌యోజ‌నం జ‌రిగితే... వంద ప్ర‌యోజ‌నాలు జ‌రిగిన‌ట్లుగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లే ఈ వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అధికారంలో ఉంటే... చంద్ర‌బాబు నోటి వెంట ఎంత‌మేర డాంబిక ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయో, ఇప్పుడు వాటి కంటే కూడా అధిక మోతాదులో డాంబికాలు ప‌లుకుతున్న లోకేశ్... నిజంగానే జ‌నానికి కోపం తెప్పిస్తున్నారు.

మొన్న‌టికి మొన్న క‌డ‌ప జిల్లాకు వెళ్లిన నారా లోకేశ్... అక్క‌డి డ్వాక్రా మ‌హిళ‌లు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక నీళ్లు న‌మిలిన సంగ‌తి తెలిసిందే. ఏదో త‌న‌కు తెలిసిన విష‌యాన్ని చెప్పేస్తే స‌రిపోతుందిలే అనుకున్న ఆయ‌న‌ను అక్క‌డి మ‌హిళ‌లు ఒక్క ప‌ట్టాన వ‌ద‌ల‌లేదు. ఇచ్చిన హామీల మేర‌కు త‌మకు ప్రభుత్వం ఏమీ చేయ‌లేద‌ని వారు చెబుతుంటే... వారిని క‌న్విన్స్ చేయ‌డానికి లోకేశ్ ప‌డిన పాట్లు నిజంగానే జ‌నాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌నే చెప్పాలి. వెర‌సి మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన లోకేశ్ లో స‌త్తా ఏమీ లేద‌న్న వాద‌న కూడా ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో క‌డ‌ప నుంచి క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన లోకేశ్ కు అక్క‌డ కూడా ఇబ్బందులు త‌ప్ప‌లేదు. క‌డప‌లో జ‌రిగిన అవ‌మానం కంటే కూడా లోకేశ్ కు క‌ర్నూల్లోనే మ‌రింత పెద్ద అవ‌మానం జ‌రిగిపోయింది. అస‌లు మీరు చెబుతున్న మాటల్లో ఒక్క శాతమైనా నిజముందా? అంటూ జ‌నం నిల‌దీయ‌డంతో లోకేశ్ దాదాపుగా షాక్ తిన్నార‌నే చెప్పాలి.

ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... కర్నూలులో ఓ సభకు హాజరైన సందర్భంగా మంత్రి లోకేష్‌ కు స్థానికులు సూటి ప్రశ్న సంధించడంతో నీళ్లు నమలడమే మంత్రి వంతయింది. రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయని, తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని లోకేశ్‌ పేర్కొన్నారు. కియ మోటార్స్‌ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయ‌న చెప్పడంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అంతే ఒక్క‌సారిగా గొంతు విప్పిన స్థానికులు... 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయ‌ని చెబుతున్నారు క‌దా... ఆ ఉద్యోగాలు పొందిన‌ వారిలో ఒక్కరిని చూపిస్తే చాలంటూ లోకేశ్‌ ను నిలదీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియ‌క లోకేశ్ నీళ్లు న‌మిలితే... వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు  ప్రశ్నించిన వారిని అడ్డుకుని వారించేందుకు య‌త్నించారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు.. కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వాలంటూ టీడీపీ నేతలపై వారు మండిపడ్డారు.
Tags:    

Similar News