మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యంపై మనవడి మాట ఇది..

Update: 2019-09-20 16:47 GMT
టీడీపీ సీనియర్ నేత ఎన్.శివప్రసాద్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు స్పందించారు. తమ తాతయ్య ఆరోగ్యంపై సోషల్ మీడియాలో - కొన్ని చానళ్లలో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయని.. ఆయన అనారోగ్యంగా ఉన్నమాట వాస్తవమే అయినా ఆయన బతికే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని కోరారు.

తమ తాతయ్య ఆరోగ్యం బాగుండకపోతే వారం రోజుల క్రితం చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో మెయిన్ బ్రాంచ్ లో ఆయనను చేర్చామని చెప్పారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్న సమయంలో మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని - ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు. క్రిటికల్ కేర్ లో వున్నా కోలుకుంటున్నారని చెప్పారు. తమ తాతయ్య ఆరోగ్యం మెరుగుపడాలని, కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని కోరారు. త్వరలోనే ఆయన కోలుకుని ప్రజల ముందుకు రావాలని ఆశిస్తున్నట్టు ఓ వీడియోలో తెలిపారు.

శివప్రసాద్ మరణించినట్టు వస్తున్న వార్తలను ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ కూడా ఖండించారు. శివప్రసాద్‌కు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని - అధికారికంగా తాము ప్రకటించే వరకు వదంతులను నమ్మొద్దని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు.

మరోవైపు మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్ కూడా స్పందించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్‌ ను పరామర్శించిన చింతా మోహన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శివప్రసాద్‌ పరిస్థితి కొంత క్రిటికల్‌ గానే ఉన్నా కోలుకుంటున్నారని చెప్పారు. స్వయంగా డాక్టరైన చింతా తాను శివప్రసాద్‌ ని పరీక్షించానని.. ఆయన రక్తప్రసరణ, గుండె అన్నీ చక్కగా పనిచేస్తున్నాయని కోలుకుంటారని చెప్పారు. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Tags:    

Similar News