డబ్బులపై ఆశలేని వారే మాకు ఓటేశారు..

Update: 2019-05-26 08:42 GMT
జగన్ గెలుపును ప్రశంసిస్తూనే తాము డబ్బులు పంచకుండా రాజకీయం చేశామని.. అందుకే ఓడిపోయామని అర్థం వచ్చేలా మెగా బ్రదర్, నర్సాపురం జనసేన ఎంపీ  నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రశంసిస్తూనే ఆయన పథకాలు అమలు చేయాలంటూ సునిశిత విమర్శలు చేశారు నాగబాబు. మై చానల్ నా ఇష్టం పేరుతో తాజాగా యూట్యూబ్ లో ఒక వీడియో విడుదల చేశారు.

జనసేన ఓడిపోయినందుకు బాధపడ్డామని.. చాలా భావోద్వేగానికి గురయ్యామని నాగబాబు ఎమోషన్ అయ్యారు. అలానే వైసీపీ, టీడీపీ డబ్బులు పంచి గెలిచాయని పరోక్షంగా దుయ్యబట్టారు. డబ్బులు ఎవరిస్తారో చూడకుండా.. డబ్బుల కోసం ఆశించకుండా పవన్ కళ్యాణ్ కోసం ఓటేసిన జనసేన అభిమానులకు కృతజ్ఞతలంటూ అభ్యర్థి నాగబాబు చెప్పుకొచ్చారు. మార్పు కోరుకునే ప్రజలందరికీ జనసేన తరుఫున హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు. మనకు ఓటేసిన వారు క్లీన్ పాలిటిక్స్ మీద నమ్మకంతో ఓటేశారని.. దాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

అలాగే జగన్ గెలుపును ప్రశంసిస్తూనే ఆయన హామీలపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నవరత్నాలు కాన్సెప్ట్ ను, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకోవాలని.. మీరు నిలబెట్టుకునేలా.. మేము కూడా మా ప్రయత్నం చేస్తామని నాగబాబు సుతిమెత్తగా దెప్పిపొడిచారు. జనసేన గెలువకపోవచ్చని.. అయితే నైతికంగా మాత్రం మనమే గెలిచామని.. మంచి మార్పు తీసుకొద్దామని.. ఈ ఫలితంతో చాలా భావోద్వేగానికి గురయ్యామని నాగబాబు ఆవేదన చెందారు.

జనసేన ఓటమికి బాధపడడం లేదన్నది అబద్దమేనని.. చాలా బాధపడ్డామని.. అయితే ఇది తాత్కాలికమేనని మనం ఇలాగే ప్రజల తరుఫున నిలబడుదామని నాగబాబు స్పష్టం చేశారు. ఇంకా ముందుకు వెళ్లి మంచి ప్రజాసేవ చేద్దామని జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Full View


Tags:    

Similar News