ట్రిపుల్ త‌లాక్‌ పై గ‌ట్టి ఎదురుదెబ్బ‌

Update: 2017-04-22 07:38 GMT
ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌ బీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త‌లాక్ విష‌యంలో తన ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని వాటిని ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దే హక్కు ఆ సంస్థకు లేదని ఆలిండియా ముస్లిం మహిళా పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎండబ్ల్యూపీఎల్‌ బీ) స్పష్టం చేసింది. ‘‘కుల పంచాయతీ (ఖాప్‌ పంచాయత్) కోర్టుగా ముస్లిం లా బోర్డు వ్యవహరించకూడదు. తన నిర్ణయాలను ఇతరులపై రుద్దే హక్కు లా బోర్డుకు లేదు. ట్రిపుల్‌ తలాక్‌ పై కోర్టులు - పార్లమెంటుదే నిర్ణయమే అంతిమ నిర్ణయం. దానినే ఆమోదిస్తాం’’ అని ముస్లిం మహిళా పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్‌ అన్నారు.

మ‌రోవైపు ట్రిపుల్ తలాక్‌ తో బెదిరిస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. బాధిత మహిళ స్పందిస్తూ.. నాలుగేళ్లక్రితం పెళ్లి అయింది. వివాహం జరిగిననాటి నుంచి అదనపు కట్నం తేవాల్సిందిగా ప్రతిరోజూ చిత్రహింసలు పెట్టేవాడు. ఎన్నోసార్లు చంపాలని చూశారు. ఈ మధ్యనే పాప జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి చిత్రహింసలు ఇంకా ఎక్కువయ్యాయి. విడాకులు ఇచ్చి వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. ట్రిపుల్ తలాక్‌ ను రద్దుచేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని, యూపీ సీఎం ఆదిత్యానాథ్ వేడుకుంటున్నట్లు బాధితురాలు తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News