కలెక్షన్‌ కింగ్‌ కూడా వైసీపీ గూటికే

Update: 2019-03-26 08:17 GMT
అందరూ ఊహించినట్లేగానే కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు వైసీపీలో చేరారు. ఈ ఉదయం మంచు విష్ణుతో కలిసి లోటస్‌ పాండ్‌ లోకి జగన్‌ ఇంటికి వచ్చారు మోహన్‌ బాబు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. దాదాపు వీళ్లిద్దరి భేటీ గంటన్నర పాటు సాగింది. ఆ తర్వాత మోహన్‌ బాబుకి వైసీపీ కండువా తప్పి పార్టీలోకి అహ్వానించారు జగన్‌. జగన్‌ కోసం ప్రచారానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. మంచు విష్ణు భార్య వెరోనికా జగన్‌ బాబాయ్‌ కుమార్తే. ఈ విధంగా చూస్తే జగన్‌ తో మంచు ఫ్యామిలీకి బంధుత్వం కూడా ఉంది.

మోహన్‌ బాబు గతంలో టీడీపీలో ఉండేవారు. ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీలోంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ అధికారికంగా ఆయన చేరలేదు. అయితే గత కొన్నాళ్లనుంటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు మోహన్‌ బాబు.తన కాలేజీకి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిల్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన తిరుపతిలో ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఈ ధర్నా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. కేవలం జగన్‌ కు ఫేవర్‌ చెయ్యడం కోసమే మోహన్‌ బాబు ఇదంతా చేస్తున్నారని టీడీపీ వర్గాల ఆరోపించాయి. దీంతో.. అందరి నోళ్లు మూయించడం కోసం ఇప్పుడు జగన్‌ పార్టీలో చేరారు. ఇక నుంచి ప్రభుత్వం విస్మరించిన అంశాలపై తన పోరాటం ఉంటుందని  ఈ సందర్భంగా మోహన్‌ బాబు చెప్పారు. సినిమా వాళ్లంతా వైసీపీ కండువా కప్పుకుంటున్న వేళ.. మోహన్‌ బాబు లాంటి లెజండరీ నటుడు పార్టీలో చేరడం.. పార్టీకి మంచి బలాన్నిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Tags:    

Similar News