ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపిన తండ్రి

Update: 2020-02-20 07:45 GMT
ఒక్కసారిగా రాజకీయంలోకి ఎదిగామంటే బంధుబలగాన్నంతా దింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆ విధంగా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. ఆ విధంగా తమ బలగం పెంచుకుంటూ ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారు. ఒకరు ప్రవేశించారంటే మిగతా వారికి ఎంట్రీ సులువుగా వస్తుంది. ఆ విధంగానే ఓ ఎమ్మెల్యే తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం బెడిసికొట్టింది. సొంత పార్టీ ఎమ్మెల్యేను ఝళక్ ఇవ్వడంతో ఆయన ఖంగు తిన్నాడు. తీరా ఆ ఇద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. దీనికి తండ్రికి పోస్టు కోసం చేసిన ప్రయత్నాలే కారణం.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ జిల్లాలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. నిన్నమొన్నటి వరకు స్నేహాపూర్వకంగా ఉన్న వీరు ఇప్పుడు వీరి మధ్య విబేధాలు వచ్చాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. సహకార ఎన్నికలలో జరిగిన పరిణామాలు వీరి మధ్య వివాదానికి కారణమైంది.

ఎమ్మెల్యే గణేశ్ గుప్తా స్వగ్రామం మాక్లూరు. ఈ గ్రామం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గం లో ఉంది. ఈ క్రమంలో ఇటీవల సహకార ఎన్నికలు వచ్చాయి. తన తండ్రి కృష్ణమూర్తిని డీసీసీబీ లేదా డీసీఎంఎస్ ఛైర్మన్ గా చేయాలని గణేశ్ గుప్తా భావించాడు. ఈ నేపథ్యంలోనే స్వగ్రామం మాక్లూర్ లోని ఒకటో టీసీ నుంచి డైరెక్టర్‌ గా తన తండ్రి బిగాల కృష్ణమూర్తి ని ఏకగ్రీవం గా ఎన్నికయ్యేలా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా వ్యవహారం నడిపించాడు. ఇక దీంతో పాటు ఆ సొసైటీలో డైరెక్టర్లంతా గులాబీ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. ఇక మాక్లూర్ సొసైటీ చైర్మన్‌ గా తన తండ్రి ఎన్నిక ఖాయమేనని భావించాడు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడ్డంకిగా నిలిచారు. సహకరిస్తారనుకుంటే అడ్డుకోవడంతో ఖంగు తిన్నాడు. జీవన్ రెడ్డి ఓకే అంటే ఆ ఎమ్మెల్యే తండ్రి కృష్ణమూర్తి సొసైటీ చైర్మన్ అవుతారని పార్టీ అధిష్టానం తెలిపింది. ఈ విషయమై జీవన్ రెడ్డితో చర్చించగా అంగీకరించలేదు. మాక్లూర్ సొసైటీ ఛైర్మన్ పదవిని కృష్ణమూర్తికి కాకుండా తన అనుచరులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పించుకున్నారు. దీంతో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు షాక్ తగిలింది. తన తండ్రిని డీసీసీబీ చైర్మన్ గా చేద్దామనుకుంటే కనీసం సొసైటీ చైర్మన్ కూడా కాకపోవడతో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు స్నేహంగా ఉండే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఝలక్ ఇవ్వడంతో మండిపడుతున్నారు.
4

తన తండ్రికి పదవి అప్పగించడం కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కూడా మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తోంది. ఇన్ని చేసినా జీవన్ రెడ్డి అంగీకరించకపోవడంతో విబేధాలు మొదలయ్యాయి. గణేశ్ గుప్తా తండ్రిని చైర్మన్ చేయాలని జీవన్ రెడ్డికి నచ్చచెప్పిన వినకపోవడంతో.. ఆయన మాట కూడా చెల్లుబాటు కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. తండ్రి కోరిక తీర్చలేక.. తన పంతం నెగ్గకపోవడంతో గణేశ్ గుప్తా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి తీరుపై అగ్గిమీద గుగ్గలమవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే జీవన్ రెడ్డి అలా చేయడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ బహిరంగంగా ప్రకటించాడు.. ఎమ్మెల్యేలే నియోజక వర్గానికి బాసులు. ఏ నిర్ణయమన్నా ఎమ్మెల్యేనే ఫైనల్ అని ప్రకటించారు. ఈ క్రమంలో గణేశ్ గుప్తా తన నియోజకవర్గంలో తన తండ్రిని సొసైటీ చైర్మన్ గా చేయాలని చూడడాన్ని సహించలేదు. తన నియోజకవర్గం లో మరో ఎమ్మెల్యే, మరొకరి పెత్తనం ఏమిటని భావించి ఆయనను చైర్మన్ కాకుండా చేశారు. తన నియోజకవర్గంలో అర్బన్ ఎమ్మెల్యే ఆధిపత్యం పెరగొద్దనే ఉద్దేశంతో గణేశ్ గుప్తాకు షాక్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. పైగా అధిష్ఠానం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేకపోవడంతో ఆయన కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. ఒక ఇంట్లో రెండు పదవులు వద్దనే సంకేతాలు ఇచ్చేందుకు అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదనే తెలుస్తోంది.అది ఏమై ఉన్నప్పటికీ జిల్లాలో పక్క పక్క నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల మధ్య వివాదం నెలకొంది. మరీ ఈ వివాదం రానున్న రోజుల్లో ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.



Tags:    

Similar News