ఏపీపై ప్రేమ‌ను త‌గ్గించుకోలేక‌పోతున్న కేటీఆర్‌...

Update: 2022-02-07 14:30 GMT
విశాఖ ఉక్కు ప్రైవేటుప‌రం చేయాల‌నే ఆలోచ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం వేగంగా ముందుకు తీసుకువెళుతుంద‌న్న ఆందోళ‌న‌ల‌తో ఉక్కు కార్మికులు, వివిధ రాజ‌కీయ పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కేంద్రం త‌న నిర్ణ‌యంతో ముందుకు సాగుతుంద‌న్నట్లుగా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సంతకాలు సేకరించారు. ఇలా ఓవైపు పోరాట క‌మిటీ ఆందోళ‌నలు కొన‌సాగుతుంటే మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సింగ‌రేణి బొగ్గు బ్లాకుల‌ను ప్రైవేటుకు అప్ప‌గించ‌డాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. నిన్న నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం...నేడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్ల బంగారం యావత్ తెలంగాణకే కొంగు బంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగానే విశాఖ ఉక్కు గురించి మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావించారు. త‌మ పక్క రాష్ట్రమైన అంద్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్ధం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్ధను చంపే కుట్రకు తెరలేపిందని కేటీఆర్ అన్నారు. మరోవైపు గుజరాత్ రాష్ట్రంలో మాత్రం అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్ధకు కేటాయించినట్టు పేర్కొన్న కేటీఆర్ బీజేపీ పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానం ఉందన్నారు. మొత్తంగా బీజేపీ పాల‌న‌పై విరుచుకుప‌డే స‌మ‌యంలో ఏపీ అంశాల‌ను మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావించార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News