మోడీ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్‌.. మ‌రి జ‌నాల‌ ఆధార్ ఎంత భ‌ద్రం?.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌

Update: 2021-12-14 02:30 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద చిక్కుల్లోనే ప‌డ్డారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల కు స‌మాధానం మాట అటుంచితే.. దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎందుకంటే.. ప్ర‌ధాని మోడీ నిత్యం ప్ర‌జ‌ల‌తో ప‌రోక్షంగా సంబాషించే  ట్విటర్‌ ఖాతా మరోమారు హ్యాకింగ్‌కు గురైంది. గుర్తుతెలియని హ్యాకర్లు  ఆ ఖాతాలోకి చొరబడ్డారు. ''భారత్‌లో బిట్‌కాయిన్‌ను అధికారికంగా ఆమోదిస్తున్నాం. దానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం'' అంటూ హ్యాకర్లు పోస్ట్‌ చేశారు. ''భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను అధికారికంగా కొనుగోలు చేసింది. వాటిని ప్రజల్లో పంచడానికి చర్యలు తీసుకుంటోంది'' అని ఆ పోస్టులో వివరించారు. ఇది దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. మోడీ ట్విట్ట‌ర్‌ను పాలో అయ్యే వారంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

నిజానికి క్రిప్టోకరెన్సీపై నియంత్రణకు భారత్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ట్విటర్‌ హ్యాండిల్‌(పీఎం ఎట్‌ నరేంద్రమోదీ) ఖాతాలోని బిట్‌కాయిన్‌ పోస్టుతో నెటిజన్లు విస్మ‌యానికి గుర‌య్యారు. ''ఈ ఖాతా హ్యాక్‌ అయ్యి ఉంటుంది. ఇలాంటి పోస్టులు హ్యాకర్ల పనే'' అని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) వెంటనే అప్రమత్తమైంది. భద్రతను పెంచి, పాస్‌వర్డ్‌ను మార్చింది. ప్రధాని ట్విటర్‌ ఖాతా స్వల్పకాలికంగా(బ్రీఫ్‌) హ్యాకింగ్‌కు గురైందని  తెలిపింది. ట్విటర్‌-ఇండియా కూడా ఈ ఘటనపై స్పందించింది.

ప్రధాని ఖాతా హ్యాక్‌ అయ్యిందని తెలియగానే.. చర్యలు తీసుకుని, పునరుద్ధరించామని పేర్కొంది. హ్యాక్డ్‌, పీఎంమోడీ, మోడీ అకౌంట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో ఉన్న లింకులను క్లిక్‌ చేయకూడదని నెటిజన్లకు సూచించింది. అటు భారత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ(సెర్ట్‌-ఇండియా) కూడా హ్యాకింగ్‌ ఉదంతంపై పరిశోధన ప్రారంభించింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ట్విటర్‌ అంతర్గత కంప్యూటర్ల ద్వారా ఈ హ్యాకింగ్‌ జరగలేదని నిర్ధారించింది. ఇదిలావుంటే, మోడీ ట్విట్ట‌ర్ హ్యాక్ కు గురైన నేప‌థ్యంలో విప‌క్షాలు స‌ర్కారును టార్గెట్ చేశాయి. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు   కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

అదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ త‌న‌ట్విట్ట‌ర్ ఖాతానే ర‌క్షించుకోలేక పోయారు. ఇక‌, దేశ ప్ర‌జ‌ల ఆధార్ ను ఎలా ర‌క్షిస్తారు? అంటూ.. విప‌క్ష నేత‌లు ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో మోడీని టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, మోడీ ట్విట్ట‌ర్ నుంచి హ్యాక‌ర్లు బిట్ కాయిన్ల‌ను అమ్మ‌తున్నారంటే.. `కాప‌లాదారుడు` ఏం చేస్తున్నాడు.. ఎక్క‌డున్నాడు? అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘ‌ట‌న‌ను బ‌ట్టి దేశ సైబ‌ర్ భ‌ద్ర‌త ఎలాంటి అవ‌సాన ద‌శ‌లో ఉందో అర్ధ‌మ‌వుతోంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News