వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఔట్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌

Update: 2020-10-06 15:30 GMT
ఏపీ చ‌రిత్ర‌లో తొలిసారి 51 శాతం ఓట్లతో ఘ‌న విజ‌యం సాధించిన వైసీపీ.. 151 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణం చేశారు. ఆయ‌న ల‌క్ష్యం 30 ఏళ్ల‌పాటు వ‌రుస‌గా పార్టీ అధికారంలో ఉండాలి. మ‌రి దీనికి అనుస‌రించాల్సిన వ్యూహం ఏంటి?  ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రి క‌ళ్లూ క‌ప్ప‌లేరు. కేవ‌లం ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకోవ‌డం ఒక్క‌టే మార్గం. దానినే ఆయ‌న అనుస‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు దేనిని ప్రామాణికంగా తీసుకుని గ‌త ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపారో.. స‌ద‌రు అవినీతి.. నాయ‌కుల‌పై మ‌ర‌క‌లు లేకుండా చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే త‌న మంత్రి వ‌ర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేశారు. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, పార్టీలో అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించ‌డం, ప్ర‌జ‌లు కోరుకున్న విధంగా న్యాయం చేయ‌డం అనే రెండు కీల‌క అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు జ‌గ‌న్ సంక‌ల్పం చెప్పుకొన్నారు. దీనినే ఆయ‌న త‌న మంత్రుల‌కు కూడా చెప్పారు. మ‌రో ఆరేడు మాసాల్లో ఈ స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర ప‌డుతోంది. అంటే.. మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించే క్ర‌తువుకు దాదాపు కౌంట్ డౌన్ స్టార్ట‌యింద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు పోతారు? అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీని ప్ర‌కారం.. మంత్రి వ‌ర్గం నుంచి ఔట్ అయ్యే జాబితాలో చాలా మంది నేత‌లు ఉన్నారు. ముఖ్యంగా అనంత‌పురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మంత్రి శంక‌ర నారాయ‌ణ పేరు బాగా వినిపిస్తోంది. ఆయ‌న ఎమ్మెల్యేల‌కు, నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే క‌ర్నూలు జిల్లాలో గుమ్మ‌నూరు జ‌య‌రాం. ఇటీవ‌ల ఓ కారు విష‌యంపై ఆయ‌న కుటుంబంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, క‌డ‌ప వైఎస్సార్ జిల్లాలో.. మంత్రి అంజాద్ బాషా ను ప‌క్క‌న పెడ‌తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం ఉంది. ఆయన స్థానంలో రాయ‌చోటికి చెందిన ఎమ్మెల్సీకి చాన్స్ ఇస్తార‌ని అంటున్నారు. ఇక‌, చిత్తూరు జిల్లాలోనూ మార్పు త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ఇక‌, నెల్లూరులో ఉన్న ఇద్ద‌రు మంత్రులు గౌతం రెడ్డి, అనిల్‌కుమార్‌ల‌కు కూడా ప‌ద‌వీ గండం ఉంద‌ని చెబుతున్నారు. రెడ్డి కోటాలో మ‌రొక‌రికి అవ‌కాశం ఇవ్వాలి పైగా ఈ జిల్లా నుంచే ఇవ్వాలి కాబ‌ట్టి.. గౌతంరెడ్డిని ప‌క్క‌న పెట్టే చాన్స్ ఉంది. ఇక‌, యాద‌వ సామాజిక వ‌ర్గంలో కృష్ణాజిల్లా పెన‌మ‌లూరుకు చెందిన కొలుసు పార్థ‌సార‌థికి ఇవ్వాలి కాబ‌ట్టి అనిల్‌ను ప‌క్కన పెడ‌తార‌ని తెలుస్తోంది.

ప్ర‌కాశం  జిల్లాలో ఇద్ద‌రుమంత్ర‌లు బాలినేని శ్రీనివాస్‌, ఆదిమూల‌పు సురేష్‌ ఉన్నారు. ఉంచితే..వీరు ఇద్ద‌రినీ ఉంచుతారు. లేక‌పోతే.. మొత్తానికే ఖాళీ చేసి కొత్త‌వారికి ఇస్తారు. ఇక‌, గుంటూరు మాత్రం ఒకింత సేఫ్ జోన్‌లోనే ఉంది. ఇక‌, కృష్ణా జిల్లాకు వ‌స్తే.. మంత్రి కొడాలికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఆయ‌న ప్లేస్‌ లో ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన అబ‌య్య చౌద‌రి కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక‌, మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ ను కొన‌సాగిస్తార‌ని అంటున్నారు. ఇక‌, గోదావ‌రి జిల్లా ల నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఇప్పుడున్న‌వారిని పూర్తి గా రీప్లేస్ చేస్తార‌ని తెలుస్తోంది. అయితే, ఇక్క‌డ సీనియ‌ర్‌ గా ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ను కొన‌సాగించే అవ‌కాశం మెండుగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా మార్పు మాత్రం ఖాయం. 
Tags:    

Similar News