మోదీపై దాడి: మ‌రో నేత హాట్ కామెంట్స్‌

Update: 2017-10-07 10:13 GMT
ప్ర‌పంచమే ఇష్ట‌ప‌డుతున్న నేత‌గా బీజేపీ నేత‌లు ప్ర‌స్తుతం కీర్తిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌లే దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న‌టికి నిన్న మాజీ మంత్రి - మేధావి య‌శ్వంత్ సిన్హా.,. మోదీపై నిప్పులు చెరుగుతూ వ్యాసం రాయ‌డం  స‌హా మీడియాకు పెద్ద ఎత్తున ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. దేశాన్ని నాశనం చేశార‌ని, భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని మోదీపై ధ్వ‌జ‌మెత్తారు. దీంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అయితే, ఇంత‌లోనే బీజేపీ ఈ కామెంట్ల‌కు కౌంట‌ర్‌గా ఆయ‌న కుమారుడిని రంగంలోకి దింపి.. మోదీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయించుకుని య‌శ్వంత్ వేడినుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది.

అయితే, ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా..ఇప్పుడు మ‌రో నేత - ప్ర‌ముఖ ర‌చ‌యిత అరుణ్ శౌరి కూడా మోదీపై దుమ్మెత్తి పోశారు. ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తాను చేసిన రెండో తప్పని పేర్కొన్నారు. అప్పట్లో వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చి తొలి తప్పు చేశానని, ఇప్పుడు నరేంద్రమోదీకి ఇచ్చి రెండో తప్పు చేశానని పేర్కొన్నారు. ‘‘నేను రెండు తప్పులు చేశా. అప్పుడు వీపీ సింగ్ (మాజీ ప్రధాని)కు, ఇప్పుడు మోదీకి మద్దతిచ్చి తప్పు చేశా’’ అని పేర్కొన్నారు.

కౌసౌలీలో జరిగిన కుష్వంత్ సింగ్ ఆరో సాహితీ ఉత్సవంలో ‘పాలకులను ఎలా గుర్తించాలి... అవేంటి?’ అనే విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు ఇప్పుడేం చేస్తున్నారో దానిని అనుసరించొద్దు. గతంలో వారేం చెప్పారో దాని గురించి ఆలోచించండి’’ అని శౌరీ పిలుపు నిచ్చారు. ‘‘ఇది మన గొప్ప ఫెయిల్యూర్. మన దినపత్రికలు, నాలాంటి వారు మోదీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని చెబితే నమ్మేశాం’’ అని శౌరీ పేర్కొన్నారు.

అంటే.. ప్ర‌స్తుతం మోదీ దేశాన్ని నాశ‌నం చేశార‌ని, చేస్తున్నార‌ని అరుణ్ గొంతులో ప‌లికింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి అరుణ్ శౌరి పెద్ద ర‌చ‌యిత‌, ఆయ‌న ఆలోచించ‌కుండా, ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రు. అందునా క‌రుగ‌ట్టిన బీజేపీ వాదం ఆయ‌న సొంతం. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు మోదీపై విరుచుకుప‌డ‌డం అంటే.. ఇందులో ఏదో నిజం ఉంద‌ని అంటున్నారు. మ‌రి అరుణ్ వ్యాఖ్య‌ల‌కు మోదీ గ్రూప్ ఎలా కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News