ఆ విద్యార్థుల‌తో మోడీ దండ‌కాలా? కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్‌

Update: 2022-03-04 13:29 GMT
తెలంగాణ మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు.. కేటీఆర్‌.. కేంద్రంపై ఫైరయ్యారు. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వ‌స్తున్న విద్యార్థుల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వంలోని కొంద‌రు మంత్రులు.. మోడీ దండ‌కాలు వ‌ల్లె వేయించ‌డంపై ఆయ‌న తీవ్రంగా రుసురస లాడారు. ``వారంతా బిక్క‌టిల్లిపోయారు.

బిక్కుబిక్కు మంటూ..ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని స్వదేశానికి వ‌స్తున్నారు. వారు గ‌త వారం రోజులుగా ఏం తిన్నారో.. ఎలా ఉన్నారో.. కూడా తెలియ‌దు.. కానీ, వారితో మాత్రం మీరు మోడీ దండ‌కాలు వల్లె వేయిస్తున్నారు. `` అంటూ కేటీఆర్ ఫైరయ్యారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌త పౌరులు, విద్యార్థుల‌ను `ఆప‌రేష‌న్ గంగ‌` కార్య‌క్ర‌మం కింద కేంద్ర ప్ర‌భుత్వం స్వదేశానికి తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందు కోసం నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలను పంపారు. వారు అక్కడ నుంచి వాయుసేన విమానాల్లో స్వదేశానికి భారతీయులను పంపుతున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు.. `జై మోడీ` నినాదాల పైన‌ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 'పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌'గా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ దయ వల్లేప్రాణాలు దక్కాయంటూ.. ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

ఆ వీడియో క్లిప్ లో ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన విమానంలో కేంద్ర మంత్రి అజయ్ భట్ విద్యార్ధులతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని మోడీ దయ వలనే ప్రాణాలతో బయట పడ్డారంటూ వ్యాఖ్యానించారు.

భారత్ మతాకు జై అంటూ...కొనసాగింపుగా విద్యార్ధులతో మోడీ జీ జిందాబాద్ అనే నినాదాలు చేయించారు. దీనిని పోస్టు చేసిన కేటీఆర్ ఆందోళనతో..ఆవేదనతో ఉన్న విద్యార్ధుల తో ఏంటీ ఈ విధానం అంటూ ప్రశ్నించారు. కాగా, ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 16 వేల మందిని స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగా శాఖ ప్రకటించింది.

రాబోయే 2, 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్దుల కోసం ఢిల్లీలోని ఏపీ -తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేసారు. ఢిల్లీ నుంచి వారిని స్వరాష్ట్రాలకు పంపుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు.
Tags:    

Similar News