ఇది ఆత్మ‌గౌర‌వ బావుటా: కేటీఆర్ రియాక్ష‌న్‌

Update: 2022-11-06 16:43 GMT
అభివృద్ధికి, అత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టంకట్టారని టీఆర్ ఎస్ నేత‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మునుగోడులో టీఆర్ ఎస్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. మునుగోడులో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసినందుకు సంతోషంగా ఉందన్నారు.  ‘‘కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దింది నరేంద్రమోడీ, అమిత్‌ షా. వారికి ఓటర్లు చెంప ప‌గిలేలా తీర్పు ఇచ్చారు`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి కావొచ్చు.. కానీ, వెనుక ఉండి నడిపించింది మోడీ, అమిత్ షా అని పేర్కొన్నారు.  మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుకు వారికి  చెక్కర్‌(జ్వ‌రం) వచ్చిందని అన్నారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపిందని, త‌మ‌ అభ్యర్థికి ఇంకా మెజార్టీ రావాల్సి ఉందని, కానీ, బీజేపీ రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ విమ‌ర్శించారు. డబ్బు, అధికార మదంతో మునుగోడు ప్రజలను కొనాలని చూశారని వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే రూ.కోటితో దొరికింది బీజేపీ కార్పొరేటరేన‌ని, ఈటల రాజేందర్‌ అనుచరుడు కడారి శ్రీనివాస్‌ రూ.90 లక్షలతో దొరికింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. డాక్టర్‌ వివేక్‌.. గుజరాత్‌ నుంచి రూ.2.5కోట్లు హవాలా ద్వారా తెప్పించింది నిజం కాదా? అన్నారు. వివేక్‌ కంపెనీ నుంచి రూ.75కోట్లు రాజగోపాల్‌రెడ్డి కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది వివేక్‌ కాదా? రాజగోపాల్‌రెడ్డి కంపెనీ సుశీ ఇన్‌ఫ్రా నుంచి మనుగోడు ప్రజల ఖాతాల్లోకి రూ.5.25 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌న్నారు.

త‌మ నేత‌ల‌పై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీఆర్ఎస్‌ మెజార్టీని తగ్గించగలిగారు కానీ, గెలుపును అడ్డుకోలేక పోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ``ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ, మునుగోడు ఉప ఎన్నిక మాత్రమే ఎందుకు ధనమయమైందో ప్రజలు ఆలోచించాలి. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది బీజేపీ కాదా? రూ.వందల కోట్లు ఇచ్చి ఎన్నికల్లో ఎలాగైనా గెలవండని అడ్డదారులు తొక్కుతున్నది బీజేపీ కాదా?`` అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఓటమిని హుందాగా ఒప్పుకునే ధైర్యం బీజేపీ నేతలకు ఉండాలని కేటీఆర్ హిత‌వు ప‌లికారు. కారును పోలిన గుర్తులకు 6వేల ఓట్లు పోలయ్యాయన్నారు. ఈవీఎంలను మేనేజ్‌ చేస్తామని ఢిల్లి నుంచి వచ్చిన బ్రోకర్లు కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. `` పలివెలలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడి చేశారు. 12మంది కార్యకర్తల రక్తం కళ్లచూశారు. సానుభూతి కోసం ఈటల రాజేందర్‌ ప్రెస్‌మీట్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ బండి సంజయ్‌ అర్ధరాత్రి వేసిన నాటకాలను ప్రజలు పట్టించుకోలేదు. కర్రు కాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు`` అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.
Tags:    

Similar News