షాకిచ్చిన కేశినేని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరట.. ఎందుకంటే?

Update: 2021-09-25 03:44 GMT
ఓవైపు అధికారం లేకపోవటం.. మరోవైపు మీద పడుతున్న వయోభారం.. ఇవన్నీ సరిపోనట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడో తలనొప్పి అదనంగా చేరింది. పార్టీ నేతలు పలువురు తీసుకుంటున్న నిర్ణయాలు.. వారు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక ఇష్యూ సెటిల్ అయ్యిందన్న ఆనందం కూడా మిగిలకుండా మరో అంశం తెర మీదకు రావటం ఆయన్ను ఇబ్బందులకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

ఊహించని విధంగా ఆయన నిర్ణయం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె కానీ ఎన్నికల్లోపోటీ చేయమని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. దాదాపు నెల క్రితమే బాబుకు ఆయనీ విషయాన్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. తన కుమార్తె ఇప్పటికే టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయిందని.. తాను మాత్రం పార్టీలో కొనసాగుతాను తప్పించి.. పోటీ చేసే ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున మరోఅభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఎందుకిలా? కేశినేని నాని ఇలాంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన కుమార్తె విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం ఆయన్ను బాధించినట్లుగా చెబుతున్నారు.

కార్పొరేషన్ ఎన్నికల వివాదంలో సొంత పార్టీ నేతలు వ్యవహరించిన తీరుతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించిన పార్టీ నేతలపై హైకమాండ్ చర్యలు తీసుకోకపోవటంతో నాని గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం. మరి.. చంద్రబాబు దీనికి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News