ఢిల్లీ అల్లర్లపై తలైవా కామెంట్స్...కమల్ మద్దతు

Update: 2020-02-27 18:30 GMT
దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతాలైన జఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, భజన్‌పుర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ అధికారితోపాటు 27 మంది వరకూ మృతి చెందారు. మరో 200 మంది క్షతగాత్రులయ్యారు. ఈ అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆ వ్యాఖ్యలకు తలైవా మిత్రుడు, విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మద్దతు తెలిపారు. శభాష్ రజనీ...అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ అల్లర్లపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కమల్ మద్దతు తెలిపారు. శభాష్ రజనీ అంటూ తని చిరకాల మిత్రుడుని మెచ్చుకున్న కమల్ హాసన్....రజనీ ఎంచుకున్న పథం సరైనదని...దానిని అలాగే కొనసాగించాలని సూచించారు. ``శభాష్ రజనీ.....ఈ మార్గానికి స్వాగతం....ఏ ఒకరికోసమో వేరు చేయబడిన మార్గం కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా ఒక జాతి మొత్తం నడుస్తున్నమార్గం....ఈ మార్గానికి స్వాగతం...ధన్యవాదాలు``అంటూ కమల్ ట్వీట్ చేశారు. ఇక, తాజాగా కమల్ చేసిన ట్వీట్ తో ఇన్నాళ్లుగా ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలకు తెరపడినట్లేనని అనుకుంటున్నారు. ఇకపై ఈ తరహా విషయాల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఉద్యమిస్తారని వారి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రెండు వైరుధ్య భావాలు కలిగిన రజనీ, కమల్ తమ భావజాలాలతోనే ఇప్పటివకు ముందుకు వెళ్లారు. చాలా అంశాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ...తాజాగా జరిగిన మతకలహాలను ఇద్దరూ ముక్తకంఠంతో ఖండించారు.

కాగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతంటూ తలైవా చేసిన షాకింగ్ కామెంట్స్ కు మద్దతుగా కమల్ ట్వీట్ చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న సమయంలో నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని రజనీకాంత్ ప్రశ్నించారు. హోంశాఖ, నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు పేట్రేగిపోయాయని రజనీ సంచలన ఆరోపణలు చేశారు. సకాలంలో కేంద్ర హోం శాఖ, నిఘా వర్గాలు స్పందించి ఉంటే ప్రాణనష్టం , ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని తలైవా అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి...ఓటు బ్యాంకు కోసం మతకలహాలు రేపడం సరికాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆందోళనకారులు హింస చెలరేగేలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని రజనీ అన్నారు. తాను బీజేపీకి మద్దతిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు చేస్తోన్న ప్రచారాన్ని తలైవా ఖండించారు. తనకు బీజేపీ తో సంబంధాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని తలైవా అన్నారు.
Tags:    

Similar News