సుప్రీం మాజీ జడ్జి కుమారుడికి జగన్ కీలక పదవి!?

Update: 2020-12-10 04:07 GMT
ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న సీఎం జగన్ నిర్ణయాలు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ ఐపీఎస్ అధికారి.. తెలంగాణ కేడర్ కు చెందిన మల్లారెడ్డికి ఏసీబీ డైరెక్టర్ గా ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేసిన వైనాన్ని మర్చిపోక ముందే.. మరో ఆసక్తికర నియామకాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగభూషణ్ ను ఏపీ ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని తాజాగా విడుదల చేశారు. ఎప్పటి నుంచైతే నాగభూషణ్ బాధ్యతలు స్వీకరిస్తారో అప్పటి నుంచి ఆయన ఆ పదవిలో ఉండనున్నారు.

ప్రస్తుతం ఏపీకి అడ్వొకేట్ జనరల్ గా సుబ్రమణ్యం శ్రీరామ్ ఉన్నారు. ఆయన తర్వాత జాస్తి నాగభూషన్ అదనపు అడ్వొకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇటీవల కాలంలో కోర్టుల్లో ఏపీ సర్కారుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకున్నట్లు చెప్పాలి. ఈ సందర్భంగా ఈ ఏడాది మొదట్లో జరిగిన ఒక పరిణామాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జాస్తి చలమేశ్వర్ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. జాస్తి చలమేశ్వర్ నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఎంతంటే.. హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు.. ఆయన పాడెను చలమేశ్వర్ స్వయంగా మోసిన వైనాన్ని మర్చిపోకూడదు. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తికి కీలక పదవిని అప్పజెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇక.. ఈ పదవికి జీతభత్యాల లెక్క మరింత ఆసక్తికరంగా మారింది. 2016లోజారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కు నెలకు రూ.40వేల చొప్పున జీతం.. వాహన అలవెన్సు కింద రూ.25వేలు.. రిట్ పిటిషన్లు.. కంటెంప్టు కేసులు.. సీఆర్పీలు.. ఇతర కేసులకు సంబంధించి కోర్టుకు హాజరైతే ఒక్కో వాయిదాకు రూ.7500చొప్పున చెల్లిస్తారు.

అదే సమయంలో సుప్రీంకోర్టుకు ఒక్కో హియరింగ్ కు రూ.1.5లక్షలు.. కోర్టు కేసుల హాజరుకు సంబంధించి విమాన ఖర్చులు మొదలు బస.. స్థానిక సౌకర్యాలన్ని ప్రభుత్వమే భరిస్తుంది.ఒకవేళ ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఖర్చు చేస్తే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీపే చేస్తుండటం గమనార్హం.  నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వారికి కీలక పదవిని జగన్ కట్టబెట్టటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది.
Tags:    

Similar News