నేపాల్ లో పెట్రోల్ కొంటున్న భార‌తీయులు..! ఇలా వెళ్లి.. అలా వ‌చ్చేస్తున్నారు!

Update: 2021-02-24 17:30 GMT
ఇప్పుడు దేశంలో పెట్రో మంట‌లు ఏ స్థాయిలో మండుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ ధ‌ర‌లు భ‌రించ‌లేక‌ స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు తమ ఛార్జీలు పెంచేయ‌డంతో ఈ భారం పాలు, కూర‌గాయ‌ల నుంచి.. అన్ని వ‌స్తువుల‌పైనా ప‌డుతోంది. దీంతో.. వాటన్నింటి ధ‌ర‌లూ పెరిగిపోతున్నాయి. దీంతో నిరుపేద‌ల నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే.. ఈ ప‌రిస్థితిని త‌ప్పించుకునేందుకు త‌మ‌కు ఉన్న అవ‌కాశాన్ని వాడుకుంటున్నారు బీహార్ ప్ర‌జ‌లు! నేపాల్ దేశానికి స‌రిహ‌ద్దున ఉన్న గ్రామాల ప్ర‌జ‌లు ప‌క్క దేశం వెళ్లి పెట్రోల్ కొని తెచ్చుకుంటున్నారు!

తాజాగా.. నేపాల్ పారిశ్రామిక రాజధానిగా పిల‌వ‌బ‌డే.. వీర్‌గంజ్ ప్రాంతం నుంచి పెట్రోల్ తరలిస్తున్న ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార‌త్‌-నేపాల్‌ సరిహద్దులు చాలా వ‌ర‌కు తెరిచే ఉండ‌డంతో కొంద‌రు అక్ర‌మంగా పెట్రోల్ ను భార‌త్ లోకి తీసుకొస్తున్నార‌ట‌. వారి నుంచి సాధార‌ణ జ‌నం కొనుగోలు చేస్తున్నారు. భార‌త్ తో పోలిస్తే నేపాల్ లో లీట‌ర్ డీజిల్ సుమారు రూ.27 తక్కువగా ఉండ‌గా.. పెట్రోల్ ధర రూ.23 తక్కువగా ఉండ‌డం విశేషం.

నేపాల్ పెట్రోలియం కొనేది భారత్ నుంచే..
ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమంటే.. నేపాల్ పెట్రోలియం ఉత్ప‌త్తులు కొనుగోలు చేసేది భారత్ నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతీ సంవత్సరం భారత్ నుంచి దాదాపుగా 71,673 కిలోలీటర్ల చమురు కొనుగోలు చేస్తుంది. అయిన‌ప్ప‌టికీ.. ఆ దేశంలో ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం విధించే ప‌న్నుల్లో తేడాలు. అక్క‌డ దేశం మొత్తం ఒకే ప‌న్ను విధానం ఉంటుంది. కానీ.. మ‌న దేశంలో ఎక్సైజ్ డ్యూటీ, తరువాత రాష్ట్రాల్లో వ్యాట్ వసూలు చేస్తారు. అందువ‌ల్లే.. మ‌న దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా ఉంటున్నాయి.

ఇక్క‌డ కొనుగోళ్లు త‌గ్గాయి..
దేశంలో పెట్రో ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డంతో చాలా కాలంగానే బీహార్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో పెట్రో కొనుగోళ్లు త‌గ్గాయి. చాలా మంది ప్ర‌జ‌లు నేపాల్ కు మ‌న ప‌క్క‌న ఊరుకు వెళ్లిన‌ట్టుగానే వెళ్లి వ‌స్తుంటారు. స‌రిహ‌ద్దులు చాలా వ‌ర‌కు అక్క‌డ తెరిచే ఉంటాయి. పైగా.. అక్క‌డి వారితో స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు చుట్ట‌రికాలు కూడా ఉన్నాయి. దీంతో.. అలాంటి వారిపై ఆంక్ష‌లు పెద్ద‌గా ఉండ‌వు. దీంతో.. నేరుగా వాహ‌నంపై నేపాల్ వెళ్లి.. అక్క‌డ పెట్రోల్ నింపుకొని వ‌స్తుంటారట చాలా మంది. ఇక‌, మ‌రికొంద‌రు భారీగా పెట్రోల్ ఇండియాకు త‌ర‌లించి, ఇక్క‌డ త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తుంటార‌ట‌.

ఈ విష‌య‌మై స‌రిహ‌ద్దు ద‌ళాలు స్పందిస్తూ.. పెట్రో అక్ర‌మ ర‌వాణాను అడ్డుకునేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ప్ర‌క‌టించాయి. చాలా వ‌ర‌కు స‌రిహ‌ద్దుల‌ను మూయించి, త‌నిఖీలు ముమ్మ‌రం చేశామ‌ని చెబుతున్నాయి. అయితే.. ఇదంతా స‌రిహ‌ద్దులో చాలా కాలంగా జ‌రుగుతున్న విష‌య‌మే అని, అది సాధార‌ణ‌మే అని ప‌లువురు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News