చిత్తూరు.. కొలాప్స్‌.. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరుస్తారా త‌మ్ముళ్లూ!

Update: 2021-03-17 02:30 GMT
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురు గాల‌లు వీయ‌డం.. ఒక ఎత్త‌యితే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో పార్టీకి మ‌రింత దారుణ‌మైన ప‌రిస్థితి ఎదుర‌వ‌డం చాలా ఇబ్బందిక‌రంగా మారింది. వాస్త‌వానికి పంచాయ‌తీఎన్నిక‌ల త‌ర్వాత‌.. చిత్తూరులో పుంజుకునేందుకు చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు. కుప్పంలో రెండు రోజులు మ‌కాం వేసి మ‌రీ.. ప్ర‌చారం చేశారు. ఇక‌, తిరుప‌తిలో ప్ర‌చారం చేయాల‌ని అనుకున్నా.. పోలీసులు నిర్బంధించారు. అయితే.. దీనిని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని..సింప‌తీ కోసం బాబు ప్ర‌య‌త్నించారు. కానీ, తాజా ఫ‌లితాల్లో మాత్రం చంద్ర‌బాబు పార్టీకి తీవ్ర వ్య‌తిరేకత రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

కారణాలు ఏవైనా తిరుపతి, చిత్తూరు నగరాల్లోనూ వైసీపీ పట్టు కొనసాగింది. చిత్తూరు జిల్లాలో 100 డివిజన్లు, 148 వార్డులూ కలిపి మొత్తం 248 మున్సిపల్‌ స్థానాలున్నాయి. వీటిలో ఏకగ్రీవాలను పక్కన పెడితే 116 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫ‌లితాల్లో టీడీపీ దిగ‌దుడుపుగా మార‌గా.. వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. మొత్తంగా 60.59 శాతం ఓటు షేర్‌ను వైసీపీ సాధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. టీడీపీ నేత‌లు ఎంత లేద‌న్నా.. సంస్థాగ‌త ఓటు బ్యాంకు క‌దిలిపోయింది. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కేవ‌లం 25.8 శాతం ఓట్ షేర్‌నే పొందింది. ఇది.. చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతంగా మారింద‌ని అంటున్నారు ప‌‌రిశీల‌కులు.

ఈ రెండు ప్రధాన పార్టీల నడుమ ఓట్ల తేడా 34.79 శాతంగా తేలింది. మున్సిపల్‌ నగరాలు, పట్టణాల వారీగా ఈ రెండు పార్టీల ఓట్ల బలాలు చూస్తే తిరుపతి నగరంలో ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో వైసీపీకి 62.9 శాతం ఓట్ల షేర్ ల‌భించింది. ఇక‌, ఇక్కడ టీడీపీకి 24.67 శాతం మాత్ర‌మే ఓట్ షేర్ ల‌భించింది. ప్ర‌ధానంగా చిత్తూరులో వైసీపీ 54.6 శాతం ఓట్ షేర్ ద‌క్కించుకోగా.. టీడీపీ 26.67 శాతానికే ప‌రిమిత‌మైంది. మదనపల్లెలో వైసీపీకి 64 శాతం, టీడీపీకి 20.25 శాతం ఓటు షేర్ మాత్ర‌మే ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, కీల‌క‌మైన ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ నగరిలో వైసీపీకి 57 శాతం ఓట్ షేర్ మాత్ర‌మే ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇక్కడ టీడీపీకి 22.99 శాతం ల‌భించింది. పలమనేరులో వైసీపీకి 66.7 శాతం(ఇదే భారీ ఓట్ షేర్‌) ఓట్ షేర్ ల‌భించ‌గా.. టీడీపీకి 29.7 శాతం ఓట్లే పోలయ్యాయి. పుత్తూరులో వైసీపీకి 57.25 శాతం, టీడీపీ 36.54 శాతం సాధించాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వం ముందుకు క‌ద‌లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News