ఉద్రిక్తతకు కారణం సర్వే ఫలితమేనా ?

Update: 2021-07-30 04:47 GMT
ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలో గెలుపు అవకాశాలు బహిష్కృత మంత్రి, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కే ఉందని ఓ సర్వే ఫలితం వెల్లడైన రోజే ఎస్సీల కేంద్రంగా గొడవలు జరగటం గమనార్హం. హుజూరబాద్ లో ఎవరు గెలుస్తారనే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్వే చేయించారు. ఆ సర్వే ఫలితాలను ఆయనే స్వయంగా ప్రకటించారు.

ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే ఈటలకు గెలుపు అవకాశాలు 64 శాతం ఉందట. టీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు 30 శాతం మాత్రమే అని తేలిందట. కాంగ్రెస్ కు 5 శాతం ఉందని కోమటిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉందని తన సర్వేలో వెల్లడైనట్లు కోమటిరెడ్డి చెప్పారు. అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఫలితాల్లో  కొద్దిగా తేడా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని కూడా కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

నిజానికి సర్వే ఫలితాలన్నవి జనాభిప్రాయంలో శాంపుల్ మాత్రమే. సర్వే ఫలితాల్లో వచ్చినట్లుగానే అన్నీసార్లు అంతిమ ఫలితాలు వస్తాయనే గ్యారెంటీలేదు. కానీ ఇక్కడ ఎంపి సర్వే ఫలితాలు విడుదల చేసిన తర్వాత గొడవలు మొదలయ్యాయంటున్నారు. ఎస్సీలను కించపరుస్తు ఈటల బావమరిది మదుసూధనరెడ్డి వ్యాఖ్యలు చేశారనేది ప్రధాన ఆరోపణ. వాట్సప్ చాటింగ్ ను పట్టుకుని ఈటల కుటుంబంపై టీఆర్ఎస్ నేతలు నానా గొడవలు చేసేశారు.

అయితే ఇదే విషయమై ఈటల కుటుంబం+ బీజేపీ నేతలు  టీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. ఈటలపై బురదచల్లటమే టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు వాట్సప్ చాటింగ్ ను సృష్టించి ప్రచారంలోకి తెచ్చారంటున్నారు. హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహానికి ఈటల భార్య జమున పాలాభిషేకం చేయటానికి చేరుకోగానే టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడకు చేరుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు, అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

జరుగుతున్నది చూస్తుంటే రెండు పార్టీల్లో ఎవరో ఒకరు కావాలనే ఎస్సీలను అడ్డుపెట్టుకుని గొడవలు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. నియోజకవర్గంలో 45 వేల ఓట్లున్న ఎస్సీలను ఎవరైనా ఎన్నికలముందు కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తారా ? అనే చర్చ పెరిగిపోతోంది. కోమటిరెడ్డి సర్వేలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలటంతో కారునేతలే కావాలని గొడవలకు దిగారని బీజేపీ నేతలంటున్నారు. మొత్తానికి ఏదో కారణంతో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నది మాత్రం వాస్తవం.
Tags:    

Similar News