పాకిస్తాన్ లోని వందేళ్ల హిందూ ఆలయం ధ్వంసం.. కారణాలపై ఆరా!

Update: 2021-03-31 04:24 GMT
పాకిస్తాన్ లోని  ఓ పురాతన హిందూ ఆలయంపై దాడులు జరిగాయి.  ఆ దేశంలోని రాపల్పిండిలోని పురానా ఖిలా ప్రాంతంలోని వందేళ్ల నాటి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ఆదివారం సాయంత్రం  ప్రయత్నించినట్లు స్థానికులు గుర్తించారు. ఈ సంఘటనను పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అల్లర్లు, దైవదూషణ, అక్రమంగా గుమిగూడి నేరాలకు పాల్పడిన ఘటనగా పాకిస్థాన్ శిక్షా స్మృతిని అనుసరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
హిందూ ఆలయాలపై దృష్టి
ఈ హిందూ ఆలయంతోనే పాటే రావల్పిండి నగరంలోని ఇతర ఆలయాలకు పూర్వ వైభవం తేవాలని స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందుకే సుజాన్ సింగ్ హవేలికి సమీపంలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలోనే దాడి జరిగిన ఈ దుర్గా ఆలయం ఒకటి.

మరమ్మతుల వేళ దాడులు
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పురాతన హిందూ ఆలయం 70 ఏళ్ల నుంచి మూతపడే ఉంది. దీనిని పునరుద్ధరించడానికి ఇటీవల చర్యలు ప్రారంభించారు. పూర్వవైభవం తెచ్చేందుకు మార్చి 24 నుంచి చర్యలు చేపట్టారు. ఇటీవల హోలీ వేడుకలనూ ఈ ఆలయ ప్రాంగంణంలో జరుపుకోవడం విశేషం. అందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆలయం ప్రాంగణంలో వస్త్ర దుకాణాలు, ఇతర షాపులను తొలగించి మరమ్మతులు చేసే పనిని మైనారిటీ ఆస్తులు పరిరక్షించే ట్రస్టుకు స్థానిక పాలనా యంత్రాంగం అప్పగించిందని తెలిపారు.

 వివరాల కోసం ఆరా
ఆదివారం సాయంత్రం పునర్నిర్మాణ పనుల అనంతరం పది మంది గల ఓ మూక ఆలయంపై దాడి చేసినట్లు అధికారులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. ఆలయంలోకి చొరబడి తలుపులు విరగ్గొట్టి, మెట్లు ధ్వంసం చేశారని అన్నారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఎలాంటి పూజలు జరగడం లేదని.. విగ్రహాలు వంటివి ఏం లేవని పేర్కొన్నారు. ఆలయ దాడిపై ఫిర్యాదుతో సిటీ పోలీసులు తమ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని... వివరాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారుని అన్నారు.

రక్షణ కోసం డిమాండ్
హిందూ ఆలయ దాడిపై పోలీసులకు మైనారిటీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఈటీపీబీ ట్రస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ సయ్యద్ రజా అబ్బాస్  ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడితో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారని అన్నారు. కాగా ఆలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేసినట్లు వ్యాఖ్యానించారు.

ఘర్షణలు తగ్గించేందుకు సంస్థ ఏర్పాటు
ఇటీవల ఆలయాలపై దాడులు పెరిగాయని పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్లో ఓ మౌల్వీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కొంతమంది కలిసి ఒక హిందూ సాధువు సమాధిని ధ్వంస చేశారని అన్నారు.  కాగా ఆ సమాధిని రెండు వారాల్లో తిరిగి పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం గమనార్హం. అందుకు స్థానిక ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. హిందూ, ముస్లింల మధ్య చెలరేగే ఘర్షణలు తగ్గించే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు.

సమాన హక్కులు
తమ దేశంలో మైనారిటీలకు అన్ని హక్కులు ఉంటాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. హిందువుల హక్కుల పరిరక్షణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags:    

Similar News