వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశం

Update: 2020-12-18 02:59 GMT
తెలంగాణ ప్రభుత్వం తీరును మరోసారి హైకోర్టు తప్పుపట్టింది. ధరణి వెబ్ సెట్ లో ఆస్తుల నమోదు ప్రక్రియను ఇష్టానుసారంగా నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తీవ్రంగా దుయ్యబట్టింది . ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్‌ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్‌ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోవడంతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని.. అయితే స్లాట్ బుకింగ్ పేరిట ఆధార్ తదితర వివరాలు కోరుతున్నారని  హైకోర్టు మండిపడింది.

న్యాయస్థానాలు వాటి తీర్పుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వానికి హితబోధ చేసింది. స్టాట్ బుకింగ్ మాన్యువల్ లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితర వివరాలు కోరుతూ ఉన్న కాలమ్స్ ను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు స్లాట్ బుకింగ్, ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎస్) ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఎలాంటి చట్టం లేకుండా ధరణి వెబ్ సైట్ లో ఆస్తుల నమోదుతోపాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు సాకేత్, గోపాల్ శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించమని స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన తెలిపింది.

సాఫ్ట్ వేర్, మ్యానువల్ ల్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 28కి  వాయిదా వేసింది.సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Tags:    

Similar News