కాంగ్రెస్ - కోదండరామ్‌ లను నిలదీయండి

Update: 2017-10-18 16:48 GMT
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంపై టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - మంత్రి హ‌రీశ్‌ రావు మండిప‌డ్డారు.  గజ్వేల్ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఒక వరప్రదాయిని అని మంత్రి అన్నారు. ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లాతో పాటు యాదాద్రి - నిజామాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ - హైదరాబాద్ జిల్లాల రైతాంగానికి మేలు చేకూరుతందని చెప్పారు. ప్రతిపక్షాలు అడ్డగోలు - అనవసర రాద్దాంతాలు చేయడం తగదని హితవు పలికారు. సిద్దిపేటవాసులు బ్రతకడం కోదండరామ్‌ కు ఇష్టం లేదా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను - ప్రొ. కోదండరామ్‌ లను నిలదీయాలని ప్రజలకు మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.

చచ్చిన వారి పేరిట వారి సంతకాలను ఫోర్జరీ చేసి - తప్పుడు కేసులు పెట్టి - శవాల మీద పేలాలు ఏరుకునే వారిలా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని...దానికి కోదండ‌రాం వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.  ``రైతు చావుకు కారకులు కాంగ్రెస్ పార్టీ. జిల్లా రైతాంగం ఉసురు తప్పక మీకు తగులుతుంది.ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే`` అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం చేసే మంచి  కార్యక్రమాలు చూసి ఓర్వలేక  దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలకు దిగడం.. మీ దిగజారుడు తనానికి నిదర్శనమంటూ.. కాంగ్రెస్ పార్టీ తీరును మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. జిల్లా ప్రజలకు అన్యాయం చేయడం తగదని  కాంగ్రెస్ పార్టీ - కోదండ రామ్ లను మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
Tags:    

Similar News