డబ్బు పంచే బీజేపీ నేతలను పట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ ... సీఎం మమతా బెనర్జీ బంపరాఫర్ !

Update: 2021-03-25 11:30 GMT
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నా కూడా అందరి ప్రధాన దృష్టి మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. అక్కడ రాజకీయ ప్రచారం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేసవిని మించిన వేడి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కనిపిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇస్తానంటూనే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తీసుకొస్తున్నారంటూ సీఎం సంచలన ఆరోపణలు చేశారు.

డబ్బులు పంచి ఓట్లను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సమాచారం నాకు ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రజలారా, వాళ్ల ట్రాప్ లో పడొద్దు. డబ్బులు పంచే బీజేపీ నేతలను నిలదీయండి. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి. డబ్బులు పంచే బీజేపీ లీడర్లను పట్టుకున్న బెంగాల్ పౌరులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా. రాబోయే ఎన్నికల్లో గెలవగానే వారికి ఈ హామీని నెరవేరుస్తా అంటూ బంకురా జిల్లాలోని బిషాన్ పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ ప్రకటించారు. నేను ప్రధానమంత్రి పదవికి, ఆ కుర్చీకి అత్యంత గౌరవం ఇస్తాను. కానీ నా జీవితంలో మోదీ లాంటి అబద్దాల కోరు అయిన ప్రధానమంత్రిని నేను చూడలేదు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే. పశ్చిమ బెంగాల్ సంస్కృతిని నాశనం చేయడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తరలిస్తున్నారు. బీజేపీ పెడుతున్న టార్చర్ ను భరించలేక ఉత్తర ప్రదేశ్ లోని ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని బీజేపీ సర్కారు పశ్చిమ బెంగాల్ కు ఏదో చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరు అని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News