ఏపీలో గూగుల్ ఫ్రీ వైఫై!

Update: 2018-08-30 11:12 GMT
న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ లో ఇక‌పై గూగుల్ సంస్థ ఉచితంగా వైఫై సేవ‌ల‌ను అందించ‌నుంది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు, తేడా లేకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవ‌లు అందించేందుకు గూగుల్ సిద్ధ‌మైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించాలన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్.....గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉచిత వైఫై సేవల కోసం ఏపీ ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్ ఎఫ్ ఎల్‌) ఆహ్వానించిన టెండర్లను గూగుల్‌ సంస్థ ద‌క్కించుకుంది. ఆ టెండ‌ర్ ను గూగుల్ ద‌క్కించుకున్నట్లు ఏపీఎస్ ఎఫ్ ఎల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ఉచిత వైఫై అందించేందుకు కావాల్సిన రూట‌ర్ల కోసం కూడా త్వ‌ర‌లోనే టెండ‌ర్లు పిల‌వ‌బోతున్న‌ట్లు తెలిపారు.

భార‌తీయ రైల్వే ఇప్ప‌టికే...ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ‘రైల్‌ టెల్‌' పేరిట ఉచిత వైఫై సేవలను అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గూగుల్ అందిస్తోన్న ఆ సేవ‌ల ప్ర‌కారం ఒక్కొక్క‌రు 45 నిమిషాలపాటు ఉచిత వైఫై వాడుకోవచ్చు. అదే విధంగా ఏపీలోని 12,900 గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు గూగుల్ స‌న్నాహాలు చేస్తోంది. తాజాగా ఏపీ స‌ర్కార్ తో గూగుల్ ఒప్పందం ప్ర‌కారం....జీ-వై ఫై స్టేషన్ల ద‌గ్గ‌ర‌ 45 నిమిషాల నుంచి గంట వరకూ ఒకేసారి ఉచిత‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ త‌ర్వాత సెష‌న్ల వారీగా రోజులో ఎంతసేపైనా ఫ్రీగా వైఫై వాడుకోవ‌చ్చు. ఊరికి రెండు రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రూటర్లు ఏర్పాటు చేయ‌బోతున్నారు. రూట‌ర్ల టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రూటర్లను ఏర్పాటు చేయాల‌ని గూగుల్ యోచిస్తోంది. అంతేకాకుండా, గూగుల్‌ యాప్‌ ఉండే ఆండ్రాయిడ్‌ టెలివిజన్‌ ఉన్న వారికి ప్రత్యేక సెట్‌టాప్‌ బాక్సులను కూడా అందజేయ‌బోతున్నారు.
Tags:    

Similar News